నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 11: తెలంగాణ ఏర్పడ్డ తర్వాతే రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, అన్నదాతల చెమట చుక్కలకు గౌరవం దక్కిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యవసాయం అన్ని రాష్ర్టాలకు దిక్సూచి అని పేర్కొన్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా మంగళవారం వనపర్తి జిల్లాకేంద్రంలో జరిగిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ధాన్యంతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని అందంగా తీర్చిదిద్దారు. తాను పెంచిన కోడెలతో కట్టిన ఎడ్లబండిని నడుపుతూ మంత్రి నిరంజన్రెడ్డి స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రంలో తెలివిలేని సర్కార్ దేశాన్ని పాలిస్తున్నదని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వానికి రైతులంటే ఏమాత్రం ప్రేమ లేదని, తన సొంత రాష్ట్రంలోనూ తెలంగాణ తరహా రైతు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే.. వలసలు వెళ్లిన వారు సైతం సొంతూర్లకు తిరిగొస్తున్నారని స్పష్టంచేశారు. కేవలం 23 నెలల్లోనే ఏదుల రిజర్వాయర్ నిర్మించడం రికార్డని తెలిపారు. 8వ విడుత రైతుబంధు సాయం ఖాతాల్లో జమ అవుతున్నదని చెప్పారు. ఇప్పటివరకు ఏడు ఎకరాలు ఉన్న 60.16 లక్షల మంది ఖాతాల్లో రూ.6,008 కోట్లు జమ చేసినట్టు తెలిపారు.
అదిరేలా సంబురాలు
సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు రైతుబంధు సంబరాలు కొనసాగుతున్నాయి. దారి పొడవునా ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతులు కదం తొక్కారు. వ్యవసాయానికి పెద్దన్నలా చేయూతనిస్తున్న కేసీఆర్కు జై కొడుతూ రైతుబంధు సాయం జీవితంలో మరువలేనిదని నినదించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడిపారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, యువనేత నల్లమోతు సిద్ధార్థ ఎడ్లబండ్ల ర్యాలీలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ర్యాలీలో 20 కిలోమీటర్లు ట్రాక్టర్ నడిపి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహపర్చారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన రైతుబంధు సంబురాల్లో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణంలో నిర్వహించిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీకి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు.
చేతిల చిల్లిగవ్వ లేకుండె
యాసంగి నాటు టైంకు చిల్లిగవ్వ లేకుండె. రైతు బంధు వస్తదనే ధైర్యముండె.. సరిగ్గ నాటు రెండు రోజులుందనంగా తెల్లారుగట్ల సెల్పోన్ల మెసేజ్ రానే వచ్చింది. అదే రోజు సింగరాజుపల్లి బ్యాంకుల పైసలిడిపిచ్చుకొని అక్కడే మసాల బస్తాలు కొనుక్కు వచ్చిన. దుక్కిపిండి, యూరియా బస్తాలు, కలుపుగూళ్లకు ఈ పైసలు అక్కెరకొచ్చినయ్. కేసీఆర్ సారు లేకుంటె దిక్కుదరి లేదు. సావుకారి సుట్టు తిరుగలేక యాస్ట కొచ్చేది. -కున్సోతు సోమన్న, రైతు, పర్రెల తండా, దేవరుప్పుల, జనగామ జిల్లా