Telangana Decade Celebrations | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గతంలో పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు పల్లెలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు వివరించాలని, దీని కోసం ఫ్లెక్సీలు ముద్రించాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయి కార్యక్రమంలో భాగంగా సాయంత్రం రవీంద్రభారతిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్యఅతిథిగా హజరవుతారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు ఇద్దరు చొప్పున సఫాయి కార్మికులను సన్మానించనున్నారు. వీరితోపాటుగా ఉత్తమ గ్రామపంచాయతీల సర్పంచులను, ఉత్తమ ఎంపీపీలను సన్మానించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పల్లెప్రగతి ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తారు. పల్లెప్రగతిలో చేపట్టిన నమునాలను కూడా ప్రదర్శిస్తారు. అనంతరం పల్లెప్రగతిపై 15 నిమిషాల వీడియోను ప్రదర్శిస్తారు.
పల్లెప్రగతి దినోత్సవం సందర్భంగా గురువారం ప్రతి గ్రామపంచాయతీ ముందు జాతీయ జెండా ఎగురవేయాలని పంచాయతీరాజ్శాఖ ఆదేశించింది. పల్లెప్రగతి ద్వారా, గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధిని, గ్రామంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలని తెలిపారు. పారిశుద్ధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో సాధించిన అవార్డుల వివరాలను చెప్పాలని పంచాయతీరాజ్శాఖ అధికారులు క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు.