Vinod Kumar | హైదరాబాద్ : గ్రామీణ తపాలా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. చిన్న ఉద్యోగులపై కేంద్రంలోని మోదీ సర్కారు తీరు సరికాదన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ను గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ నేత వెంకటేశ్వర్లు, రైల్వే ఉద్యోగుల సంఘం నేత యాదవ రెడ్డి కలిశారు. నవంబర్ 19వ తేదీ నుంచి మూడురోజులపాటు హన్మకొండలో జరిగే జాతీయ స్థాయి గ్రామీణ తపాలా ఉద్యోగుల మహాసభకు హాజరు కావాలని వినోద్ కుమార్ను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ… గ్రామీణ తపాలా ఉద్యోగులు అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలను చేరవేస్తూ ప్రజలతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్నారని తెలిపారు. ప్రజలతో విడదీయరాని బంధం కలిగిన గ్రామీణ తపాలా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ నిరాదరణకు గురై ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే తపాలా ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను, పెన్షన్లు ప్రజలకు అందజేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న గ్రామీణ ప్రాంత తపాలా ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.