ఈ బీజేపీ అధ్యక్షుడి మాటైనా వింటారా?
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు బోళ్ల సిద్ధులు. ఇతనిది జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని సిద్దెంకి గ్రామం. నెత్తికి చుట్టుకున్నది కాషాయ పార్టీ కండువా. బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రైతు అయిన సిద్ధులు వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి హామీ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు ఎప్పుడూ లేని విధంగా పని ముగిశాక కట్టెల మోపులు కట్టుకొని వంట కోసం ఇంటికి తీసుకెళ్తున్నారు. సగటు జీవి అయిన ఈ బీజేపీ నేత సైతం కట్టెలు ఏరుకొంటున్నారు. మంగళవారం ఉదయం పనికి వెళ్లిన కూలీలు కట్టె మోపులు నెత్తిన, బైక్లపై ఇంటికి తెచ్చుకొన్నారు.
బోళ్ల సిద్ధులు సైతం కట్టెలను మోపు బైక్పై ఇంటికి తీసుకెళ్లారు. దేశంలో పెరిగిన వంట గ్యాస్ ధరలు పేదల నడ్డి విరుస్తున్నాయనడానికి ఈ దృశ్యం అద్దం పడుతున్నది. దక్షిణాది రాష్ర్టాల్లో ఏనాడో ఇంటింటికీ గ్యాస్ చేరింది. వంట కోసం కట్టెలు తెచ్చుకోవడమూ మరిచిపోయారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పుణ్యమా అని మళ్లీ కట్టెల కోసం వనాల బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. కట్టెల పొయ్యి పెట్టి పొగసూరాల్సిన పరిస్థితి దాపురించింది. సిద్ధులు మాట్లాడుతూ పెరుగుతున్న గ్యాస్, డీజిల్, పెట్రోల్, మంచి నూనెల వంటి వాటి ధరలు పేదల ప్రజలకు భారంగా మారాయని వాపోయారు. పార్టీ వేరు అని, ప్రజలుగా ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించాల్సిందేనని వేడుకొన్నారు.
– గాజుల సిద్ధులు యాదవ్ (జనగామ రూరల్)
గ్యాస్ బండ పక్క పెట్టి.. కట్టెల పొయ్యిపై
ఈ ఫొటోలో పిండి పిసుకుతున్న మహిళ పేరు మాదారం కల్పన. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం దమ్మాయపల్లి గ్రామం. వీరికి వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నా.. కట్టెల పొయ్యినే వాడుతున్నారు. కారణం గ్యాస్ ధర అమాంతం పెరిగిపోవడమేనని ఆమె పేర్కొంటున్నారు. రోజూ కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకుంటామని, అప్పుడప్పుడు మాత్రమే గ్యాస్ పొయ్యి వాడుతామని చెప్తున్నారు.
వంట గ్యాస్ ధర పెరగడంతో జనగామ మండలం సిద్దెంకిలో ఉపాధి హామీ పనికి వెళ్లి వస్తూ కట్టెలు తెచ్చుకొంటున్న మహిళలు.
ధరల పెంపుపై వామపక్షాల ఖండన
కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచడాన్ని వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక పార్టీలు తీవ్రంగా ఖండించాయి. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. మంగళవారం నగరంలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. తెలంగాణ రైతుల సమస్యగా పరిగణించి, పోరాటంలో అన్ని పక్షాలను కలుపుకొని పోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 13న మరోసారి సమావేశమై ధరల పెరుగుదలపై కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు.
సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ రాష్ట్ర నాయకులు రావుల చంద్రశేఖర్రెడ్డి, సీపీఐఎంఎల్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, యంసీపీఐయూ, ఎస్యూసీఐ, ఆర్ఎస్పీ నాయకులు పాల్గొన్నారు. కాగా, బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 5న నిరసన దీక్ష చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభిస్తామని చెప్పారు.