బస్సులు, లారీల్లో అర్ధరాత్రి తనిఖీలు.. సుమారు రూ.50 లక్షల జరిమానాలు
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బస్సులు, లారీలపై ఆర్టీవో అధికారులు అర్ధరాత్రి కొరడా ఝుళిపించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై చౌటుప్పల్ టోల్ప్లాజా వద్ద ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. ఉప రవాణా కమిషనర్, డాక్టర్ పాపారావు నేతృత్వంలో రెండు ప్రత్యేక విజిలెన్స్ టీమ్లు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. తొలుత.. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఇసుక ఓవర్ లోడ్తో వస్తున్న లారీలను తనిఖీచేశారు. 15 లారీలను సీజ్ చేశారు. వీటి ద్వారా రవాణా శాఖకు రూ.10 లక్షలు, మైనింగ్ శాఖకు రూ.8 లక్షల ఆదాయం సమకూరింది. చౌటుప్పల్లో టాక్స్ కట్టని 10 బస్సులను సీజ్ చేశారు.
గూడ్స్ ట్రాన్స్పోర్టు చేస్తున్న 5 బస్సులపై కేసులు నమోదుచేశారు. తద్వారా ప్రభుత్వానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరుతుంది. మొత్తం గా ప్రభుత్వానికి సుమారు రూ.50 లక్షల ఆదాయం రాబోతున్నది. ఈ తనిఖీల్లో డీటీసీ శ్రీనివాస్, ఆర్టీవోలు సురేశ్రెడ్డి, రాంచందర్, ఎంవీఐలు ఉమామహేశ్వరరావు, శ్రీనివాస్, మహేందర్, రాహుల్, శంకర్ నారాయణ, పాల్, సాయి పాల్గొన్నారు.