హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): దసరా, బతుకమ్మ పండుగలు టీఎస్ఆర్టీసీకి ఫుల్ గిరాకీ తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో ముఖ్య పండుగలైన బతుకమ్మ దసరాకు ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లడం పరిపాటి. హైదరాబాద్ నుంచి ఆయా పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోని వారు ఊర్లకు వెళ్లడం, తిరిగి రావడంతో పది రోజులపాటు బస్సులు ప్రయాణికులతో కళకళలాడాయి. పండుగ రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ అధికారులు నాలుగు వేలకుపైగా ప్రత్యేక బస్సులను నడిపారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడంతోపాటు ఆర్టీసీకి లాభాల పంట పండింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు మొత్తం 3 కోట్ల 41 లక్షల 64 వేల మందిని ఆర్టీసీ బస్సులు గమ్యస్థానాలకు చేర్చాయి. దీంతో రూ.183.39 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. సరాసరి కిలోమీటర్కు సగటున రూ.44 ఆర్జించినట్టు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.44 కోట్ల 54 లక్షల ఆదాయం అదనంగా పెరిగినట్టు వారు చెప్పారు. ఆక్యుపెన్సీ రేషియా సైతం సరాసరిన 63.57గా నమోదైంది.