హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్చైర్మన్ ఎం థామస్రెడ్డి, కన్వీనర్ వీ బాబు, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి హాజరై ‘చలో సెక్రటేరియట్’ పోస్టర్ను ఆవిషరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 24న జేఏసీ తలపెట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఎన్నికల హామీలను నేటికీ అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిషరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ‘చలో సెక్రటేరియట్’కు జేఏసీ పిలుపునిచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోనల్ జేఏసీ కమిటీతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్ రీజినల్ జేఏసీ కమిటీలను ఎంపిక చేశారు. సమావేశంలో జేఏసీ నాయకులు ఎన్ కమలాకర్గౌడ్, బీ యాదయ్య, కే రామిరెడ్డి, సీఎన్ కృష్ణ, జీ రాములు, బుద్ధ విశాల్, బీ శ్రీనివాస్గౌడ్, సీహెచ్ రాంచందర్, బీ జ్యోతి, కరుణ, స్వప్న, ఆర్ఎన్ రెడ్డి, ధనుంజయ్, ఎంఎస్ నారాయణ, బీ పాపయ్య, ముత్యాలు, రవినాథ్, గోపు శ్రీనివాస్, డేనియల్, ఎంఎం ఖాన్, యాదయ్య, మజహర్ హుస్సేన్, నిరంజన్, వెంకటయ్య, రషీద్, గంగయ్య, శ్రీనివాస్, లక్ష్మయ్య, జగన్నాథం, కాంతారావు పాల్గొన్నారు.