హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీకి మంచి రోజులొస్తున్నాయని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) జనరల్ సెక్రటరీ మారంరెడ్డి థామస్రెడ్డి పేర్కొన్నారు. రెండేండ్ల తర్వాత ఆర్టీసీలో మళ్లీ కార్మిక యూనియ న్లు మనుగడలోకి వచ్చాయని చెప్పారు. కార్మికశాఖ జారీచేసిన యూనియన్ బైలాస్ పత్రాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తమకు అందజేశారని వెల్లడించారు. గతంలో ఉన్న డిపో సెక్రటరీలు, రాష్ట్ర నాయకులు యథాతథ స్థానాల్లో సోమవారం నుంచి తమ బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. శనివారం ఆయన బస్భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ యూనియన్ల పునరుద్ధరణ విషయంలో సమ్మె సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని సం తోషం వ్యక్తంచేశారు. ఆర్టీసీ బలోపేతంపై సీఎం కేసీఆర్కు చాలా ఆలోచనలున్నాయని, అసెంబ్లీ సమావేశాల్లో లేదా ఆ తర్వాత మంచి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నదని చెప్పారు. బాజిరెడ్డి గోవర్ధన్ను ఆర్టీసీ చైర్మన్గా, వీసీ సజ్జనార్ను ఎండీగా నియమించడం శుభపరిణామమని పేర్కొన్నారు. త్వరలో ఎమ్మెల్సీ కవిత యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. అశ్వత్థామరెడ్డి స్వచ్ఛందంగా బయటకెళ్లిపోయారని, థామస్రెడ్డి, కమలాకర్గౌడ్ ఆధ్వర్యంలో టీఎంయూ పనిచేస్తుందని ప్రకటించారు. టీఎంయూలో ఎలాంటి గ్రూప్ లు లేవని పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ ముఖ్య సలహాదారు బీ యాదయ్య, జీపీఆర్ రెడ్డి, పుల్లయ్య, నరేందర్, రఘునందన్, పీ శ్రీనివాస్రెడ్డి, రాఘవరెడ్డి, అంజయ్య, సుధాకర్ పాల్గొన్నారు.