హైదరాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగిన వేళ.. సమ్మెను నిలువరించి కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ఆర్టీసీ యాజమాన్యం ఇవాళ చర్చలకు వస్తుందా? మళ్లీ డుమ్మా కొడుతుందా? అనేది హాట్టాపిక్గా మారింది. ఈ నెల 9న లేబర్ కమిషన్ నేతృత్వంలో చర్చలకు ఆహ్వానించినా ఆర్టీసీ యజమాన్యం రాలేదు. మార్చి 25నాటి చర్చలకు కూడా అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపింది. సమ్మె నోటీసులిచ్చిన ప్రతిసారీ ప్రభుత్వ పెద్దల డైవర్షన్తో యాజమాన్యం గేమ్ ఆడుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఆర్టీసీ కార్మిక జేఏసీతో చర్చలకు రావాలని లేబర్ కమిషన్ ఆర్టీసీని ఆహ్వానించిన నేపథ్యంలో చర్చలకు వస్తారా? లేక సమ్మె చేసేవరకూ వేచిచూస్తారా? అనేది చర్చనీయాంశమైంది.
సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మిక జేఏసీ లీగల్గానే వెళ్తున్నదని నేతలు చెబుతున్నారు. మార్చి 13న సమ్మె నోటీసు ఇస్తే, ఏప్రిల్ 13 వరకు సాగదీశారని పేర్కొన్నారు. తాడోపేడో తేల్చుకొనే ఈ చర్చలకు ఆర్టీసీ వచ్చినా, రాకపోయినా.. కార్మికుల డిమాండ్లకు సరైన సమాధానం చెప్పలేక ఆ చర్చలు విఫలమైనా.. మెరుపు సమ్మె తథ్యమని చెబుతున్నారు.. ఫిబ్రవరి 23న వేలాది మందితో చేపట్టిన ‘చలో ఇందిరాపార్ మహా సమ్మేళనం’ తరహాలో సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.
ఆర్టీసీ కార్మికులు తమ హక్కులను సాధించుకునేందుకు ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ అంటూ పోరాట నినాదాలు ఇస్తున్నారు. చర్చలు విఫలమైతే ప్రకటించే సమ్మెకు ఆర్టీసీ కార్మిక, ఉద్యోగ లోకమంతా సిద్ధం కావాలని కోరుతున్నారు. రిజిస్ట్రేషన్, యూనియన్లు లేని సంఘాలు కార్మికులకు ద్రోహం చేయొద్దని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులను సమ్మెకు కార్యోన్ముఖులను చేసేందుకు నేతలు, నాయకులు డిపోలకు తిరుగుతూ సమ్మె కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. డిపోల ఎదుట గేట్ మీటింగ్లతో జోరు పెంచుతున్నారు. ఈ క్రమంలో నేడు లేబర్ కమిషన్తో జరిగే చర్చలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులందరూ ఆఫ్లో ఉన్నవారు, స్పెషల్ ఆఫ్లో ఉన్నవారు, ఫస్ట్ షిఫ్ట్ దిగిన వారు, నైట్ అవుట్ దిగిన వారు, గ్యారేజ్ కార్మికులు పెద్దసంఖ్యలో రావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఒకవేళ చర్చలు విఫలమైతే.. రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలకు పిలుపునివ్వడంతో పాటు సమ్మె తేదీని ప్రకటించాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. సోమవారం లేబర్ కమిషన్ వద్ద జరిగే సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం హాజరై సమ్మె నియంత్రణకు చర్చలు జరుపాలని సూచించారు. హామీలు అమలుకాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. 11 ఏండ్లుగా నియామకాలు లేకపోవడంతో భారాన్ని మోయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 9న లేబర్ కమిషన్ వద్ద జరిగిన సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం రాకపోవడంతో వాయిదా వేసినట్టు గుర్తుచేశారు.