నమస్తే తెలంగాణ, నెట్వర్క్: నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ బలిదానంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆర్టీసీ సమ్మె ఉధృతమైంది. ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. నిర్మల్, మంచిర్యాలలో నోటికి నల్ల గుడ్డ కట్టుకుని నిరసన తెలిపిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆర్టీసీ కార్మికులు చిల్డ్రన్ పార్కు నుంచి ర్యాలీగా వెళ్లి స్థానిక బస్డిపో వద్ద ధర్నా చేశారు. సిద్దిపేటలో మూతికి నల్లగుడ్డ కట్టుకుని ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ డిపో-1, డిపో-2 పరిధిలోని కార్మికులు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. వనపర్తి ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మె శిబిరం వద్ద నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. కామారెడ్డిలో మానవహారం ఏర్పాటు చేశారు. ఆర్మూర్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మద్దతు ప్రకటించారు. వేములవాడలో మౌన ప్రదర్శనలో పాల్గొన్న కండక్టర్ రమాదేవి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉన్నదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ ప్రశాంతం
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 24: ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. అన్నివర్గాల ప్రజలు బంద్ పాటించి ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వరంగల్ రీజియన్ పరిధిలో 8 డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా శుక్రవారం ఉదయం నుంచే డిపోల ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. హనుమకొండ బస్స్టేషన్, వరంగల్-1 డిపో ప్రాంగణం నిర్మానుష్యంగా మారిం ది. బస్సులు లేక బస్స్టేషన్లు బోసిపోయాయి. బంద్తో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రెండురోజులుగా ప్రత్యామ్నాయంగా హైర్బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు నడిపించగా, మూడోరోజు పూర్తిగా బస్సులను నిలిపివేశారు. హనుమకొండ బస్స్టేషన్ మృతుడు శంకర్గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కాకతీయ యూనివర్సిటీలో పరిధిలో శుక్ర, శనివారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.