హైదరాబాద్: భక్తుల సౌకర్యార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి వందకుపైగా మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్కు, అక్కడి నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సులు నడుపుతున్నామని చెప్పారు. లక్ష్మీనరసింహ స్వామివారి మూలవిరాట్ దర్శనాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉప్పల్ నుంచి మినీ బస్సు సర్వీసులను ఎండీ సజ్జనార్తో కలిసి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. అన్ని జిల్లా కేంద్రాల నుంచి యాదాద్రికి బస్సులు ఏర్పాటు చేశామన్నారు.
జేబీఎస్ నుంచి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75గా టికెట్ ధరను నిర్ణయించామని వెల్లడించారు. ప్రతి రోజూ 104 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాఫీగా సాగుతుందని చెప్పారు.
వీఆర్ఎస్కు రెండు వేల మంది పేర్లు నమోదుచేసుకున్నారని సజ్జనార్ తెలిపారు. వీఆర్ఎస్ కోసం ఉద్యోగులను బలవంతం చేయట్లేదన్నారు. ఉద్యోగుల వీఆర్ఎస్ సంఖ్యనుబట్టి ప్యాకేజీ సిద్ధం చేస్తామన్నారు. వీఆర్ఎస్ తేలినతర్వాత ఆర్టీసీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించారు.