హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బాదుడు షురూ చేసింది. ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5వేల ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం తెలిపారు. ఆగస్టు 26న మిలాద్-ఉన్-నబీ, ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, ఆగస్టు 30న ఆదివారం సెలవు రావడంతో పండుగకు ముందే ప్రయాణికుల రద్దీ ప్రారంభమవుతుందని, తిరుగు ప్రయాణాల రద్దీ ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉన్నదని మంత్రి తెలిపారు.
ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు సవరించామని, దూరాన్నిబట్టి 30 -50 శాతం పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని ఆర్టీసీవర్గాలు తెలిపాయి. ‘స్పెషల్ బస్’ అని రాసిలేని బస్సుల్లో అదనపుచార్జీలు వసూలు చేస్తే ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.