సూర్యాపేట: సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల (Munagala) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని ఇందిరానగర్ వద్ద ఆర్టీసీ రాజధాని బస్సును (Rajadani bus) ఓ బైకు కొట్టింది. అయితే బస్సు కిందికి మోటారుసైకిల్ దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి బస్సుకు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమయింది.
అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులు అందరిని కిందికి దించడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైదరాబాద్లోని మియాపూర్ డిపోకు (Miyapur depot) చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయవాడకు (Vijayawada) వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.