కరీంనగర్ : పందెంకోడి(Pandem kodi)కి వేలం వేయడానికి కరీంనగర్-2(karimnagar) డిపో అధికారులు(RTC officials) సిద్ధమయ్యారు. ఈనెల తొమ్మిదో తేదీన గుర్తు తెలియని ప్రయాణికుడు పందెంకోడిని బస్సులో మర్చిపోయాడు. దానిని తీసుకోవడానికి గత మూడు రోజులుగా ఎవరూ రాలేదు. దీంతో అధికారులు పందెంకోడిని వేలం వేయడానికి తేదీ ఖరారు చేశారు. శుక్రవారం(రేపు) మధ్యాహ్నం 3 గంటలకు డిపో కార్యాలయంలో బహిరంగ వేలం వేసేందుకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 9న వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్తున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో పందెం కోడిని తన వెంట తీసుకు వెళ్తున్న ప్రయాణికుడు దానిని బస్సులోనే మరిచి వెళ్లిపోయాడు. బస్సులో బ్యాగ్ గమనించిన సహచర ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్ దృష్టికి తెచ్చారు. అందులో ఏముందో పరిశీలించేందుకు ఆర్టీసీ సిబ్బంది దానిని తెరిచి చూడగా, భద్రంగా ప్యాక్ చేసి ఉన్న పందెంకోడి కనపడింది.
దీంతో దాన్ని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది కరీనంగర్(2) డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెపుకోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో శుక్రవారం వేలానికి ముహూర్తం నిర్ణయించారు.