హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమవంతు పాత్ర పోషించారని, వారి చిరకాల డిమాండ్ అయిన విలీన అంశం, గుర్తింపు సంఘాల ఎన్నికలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. మహాలక్ష్మీ పథకం విజయవంతంలో డ్రైవర్లు, కండక్టర్లకు కొంత పనిభారమైన విషయం వాస్తవమేనని, వారి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. రవాణాశాఖ మంత్రిగా ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ఉంటానని చెప్పారు. సోమవారం బేగంపేటలోని వరుణ్ మోటర్స్ వద్ద ‘వాహన్’ పోర్టల్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రెండో వాహనం కొనుగోలు చేస్తున్న వారికి వాహన పన్ను రద్దు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 15 చెక్పోస్టులు ఎత్తివేశాం. రవాణాశాఖ ఈవీ పాలసీ, స్రాప్ పాలసీ తీసుకొచ్చింది. వాహన్ పోర్టల్లో చేరడంతో వాహన రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, పన్నుల చెల్లింపు వంటి సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి’ అని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు చంద్రశేఖర్గౌడ్, రమేశ్, శివలింగయ్య, ఎన్ఐసీ ప్రతినిధి జగదీప్, వరుణ్ మోటర్స్ అధినేత వరుణ్, డీటీసీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.