హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులను తొలిరోజే యాజమాన్యం బెదిరింపులకు దిగింది. వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరికలు జారీచేసింది. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని ప్రయోగిస్తామంటూ లొంగదీసుకునేందుకు కుయుక్తులు పన్నింది. ఆర్టీసీ కార్మిక జేఏసీ, ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య సయోధ్య కుదిర్చేందుకు లేబర్ కమిషన్ జరిపిన చర్చలకు పలుమార్లు డుమ్మాకొట్టిన ఆర్టీసీ యాజమాన్యం.. ఇప్పుడు అదే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని కార్మికులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. మార్చి 13న ఇచ్చిన సమ్మె నోటీస్పై అదే నెల 25న ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలంగాణ లేబర్ కమిషన్ చర్చలకు ఆహ్వానిస్తే అసెంబ్లీ సమావేశాల పేరుతో డుమ్మాకొట్టింది.
ఆ తర్వాత ఏప్రిల్ 13న లేబర్ కమిషన్ మరోసారి చర్చలకు ఆహ్వానిస్తే.. కార్మికుల సమ్మె డిమాండ్లకు ఆర్టీసీ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని లేఖ రాసి నాటి చర్చలకు మళ్లీ గైర్హాజరైనట్టు జేఏసీ నేతలు తెలిపారు. నాడు సమ్మె డిమాండ్లపై ఎలాంటి సంబంధం లేదన్న యాజమాన్యం.. ఇప్పుడెందుకు పారిశ్రామిక వివాదాల చట్టం ఉన్నదని హెచ్చరిస్తున్నదో చెప్పాలని కార్మిక జేఏసీ నేతలు నిలదీస్తున్నారు. అయితే తాము సమ్మెలో పాల్గొనడం లేదని ఆర్టీసీ సూపర్వైజర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వాసుదేవరావు ప్రకటించారు. దీంతో ఇది కచ్చితంగా సమ్మెను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
వేతనాల్లో కోత : ఎండీ నాగిరెడ్డి
ఆర్టీసీ కార్మికులు సమ్మెను వీడి విధుల్లో చేరాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఆదేశాలు జారీచేశారు. ఇటీవల వివిధ యూనియన్లు ఇచ్చిన సమ్మె నోటీసులపై కార్మిక శాఖ, యాజమాన్యం ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీతో చర్చల ప్రక్రియను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఒక వివాదం పెండింగ్లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.