హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకంతో మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడంవల్ల టీఎస్ఆర్టీసీ లాభాల్లోకి వెళ్లిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం వల్ల.. ఆర్టీసీ బస్సులన్నీ నిండుగా వెళ్తున్నాయని చెప్పారు. మహిళల టికెట్ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పడు చెల్లిస్తున్నదని తెలిపారు. తెలంగాణకు తలమానికమైన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి ఉన్నదని చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది పడుతున్న కష్టాన్ని, శ్రమను గుర్తించి వారికి 21శాతం ఫిట్మెంట్ను ప్రకటించామని గుర్తుచేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్మార్గ్లోని డాక్టర్ బీఆర్అంబేదర్ విగ్రహం వద్ద మంగళవారంతెలంగాణ ఆర్టీసీకి చెందిన గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతోపాటు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. పర్యావరణహితమైన 22 ఎలక్ట్రిక్ బస్సులను వారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రులు ఆ బస్సుల్లో సచివాలయానికి వెళ్లారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం వల్ల టీఎస్ ఆర్టీసీ కళకళలాడుతున్నదని, ప్రతి బస్సు 100 శాతం ఆక్యుపెన్సీతో తిరుగుతున్నదని, మహాలక్ష్మి పథకాన్ని ఈ బస్సుల్లో కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్ర మంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిర్వాహకులపై చర్య తీసుకోవాలి: సీపీఎం
యాదాద్రి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, దేవాదాయశాఖ మంత్రి కొం డా సురేఖ పట్ల ఆలయ నిర్వాహకులు కులవివక్ష ప్రదర్శించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఘటనపై విచారణ జరిపించాలని, చిన్నపీటలు వేసి కులవివక్షకు బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.
భట్టి వివాదంపై గుట్ట ఈవోకు నోటీసులు?
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల పర్యటన సందర్భంగా నెలకొన్న కుర్చీ వివాదంపై దేవాదాయ శాఖ ఆరా తీసింది. ప్రధానాలయంలో జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని యాదగిరిగుట్ట ఆలయ ఈవో రామకృష్ణారావును కోరినట్టు తెలిసింది. ఈ మేరకు ఆయనకు సోమవారం రాత్రే నోటీసులు జారీ అయినట్టు సమాచారం.
ఆటో డ్రైవర్ వినూత్న నిరసన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఓ ఆటోడ్రైవర్ ఏకంగా సీఎం రేవంత్రెడ్డి పేరుతో ఆటో టికెట్ ఆఫర్ పట్టికను ఆటో అద్దానికి అతికించాడు. దీంతో తోటి ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అసలే కిరాయిలు లేవు, ఇలాంటి ఆఫర్ (తక్కువ చార్జీలు) పెడితే ఉన్న కిరాయిలు కూడా పోతాయని అతన్ని బుజ్జగించి ఆ ధరల పట్టికను తీయించారు. కొత్తగూడెం పట్టణానికి చెందిన వేణుగోపాల్ గిరాకీ లేకపోవడంతో తన ఆవేదనను ఇలా వెలిబుచ్చాడు.