కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అడ్డుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుకు నిరసనగా ధర్నాలో పాల్గొన్న ఓ ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆసిఫాబాద్లోని బ్రాహ్మణవాడకు చెందిన బూసి బాపు (50) స్థానిక ఆర్టీసీ డిపోలో ఎస్డీఐ (సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్)గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదానికి గవర్నర్ను డిమాండ్ చేస్తూ శనివారం ఆసిఫాబాద్ డిపో ఎదుట చేసిన ధర్నాలో పాల్గొన్న ఎస్డీఐ బాపు.. విధులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురయ్యాడు. స్థానిక దవాఖానలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను కుటుంబసభ్యులు కాగజ్నగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మంచిర్యాల దవాఖానకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే బాపు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్థారించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు ఆర్టీసీ కార్మికులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాపుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.