హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియమకాల ప్రక్రియ వేగవంతం చేస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. తొలివిడతలో 200 నుంచి 300 వరకు కారుణ్య నియామకాలు త్వరలోనే చేపడతామని ప్రకటించారు. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో నర్సింగ్ కాలేజీ, ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి హాజరై ప్రసంగించారు. దాదాపు ఏండేండ్ల తర్వాత ఆర్టీసీ బోర్డు సమావేశాన్ని నిర్వహించుని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులకు 5శాతం డీఏను ఇచ్చామన్నారు. సంస్థ ఆర్థికంగా బలోపేతమైతే మరిన్ని కార్మిక సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ అన్ని విధానాలుగా ఆరోగ్యవంతంగా ముందుకు వెళుతుందన్నారు. ఆర్టీసీ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసం అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆర్టీసీ సిబ్బంది, అధికారుల సమన్వయంతో సంస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ల సహకారం, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డిల నేతృత్వంలో ఎన్నో కీలక నిర్ణయాలతో ముందుకు వెళుతున్నామన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బందికి ఇక నుంచి ప్రతి ఏటా అవార్డులు అందజేయనున్నట్టు సజ్జనార్ తెలిపారు.