హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్ధాల బతుకేనని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్కి రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా కేంద్రం నుంచి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు తేవాలని డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బాజిరెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటున్నదని చెప్పారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఆయా జిల్లాల రైతులకు భరోసా ఇచ్చారని, ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రూ.154 కోట్లను విడుదల చేసిందని, ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఇవన్నీ బండికి కనిపించలేదా? అని ప్రశ్నించారు.
పొద్దున లేస్తే అబద్ధాలు మాట్లాడటమే రాజకీయమని భావించే బండికి పంటనష్టంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రస్తుత వర్షాలకు దెబ్బతిన్న పంటలపై కూడా అధికార యంత్రాంగం సర్వే నిర్వహిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నదని, రైతులపై బండి సంజయ్కు ప్రేమే ఉంటే కేంద్రంతో కొట్లాడి మరో రూ.10 వేలు తెప్పించాలని సవాల్ విసిరారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనివిధంగా రైతాంగానికి ఇప్పటివరకు రూ.4.5 లక్షల కోట్లు ఖర్చుచేసిన ఘనత సీఎంకేసీఆర్కే దక్కిందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఈ స్థాయిలో రైతులను ఆదుకున్న దాఖలాలున్నాయో చెప్పాలని బాజిరెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ మోసాలను, అసత్యాలను ప్రజలు క్షమించరని, సమయం వచ్చినపుడు వారి భరతం పడతారని తెలిపారు.