తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధ్వర్యంలో రెండేళ్లుగా కార్గో పార్సిల్ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వినియోగదారులకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ కరోనా వల్ల మరింత కష్టాల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఇతర మార్గాలను అన్వేషించి పార్సిల్, కొరియర్, కార్గో సేవలను జూన్ 19, 2020న ప్రారంభించామని వెల్లడించారు.
పార్సిల్ సర్వీసులతో రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు వెళ్లే అన్ని ప్రాంతాలకు సేవలు అందుబాటులోకి వచ్చాయని అజయ్కుమార్ తెలిపారు. గతంలో ఆర్టీసీ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా పార్సిల్- కొరియర్ సేవలను నిర్వహించేదని, ప్రస్తుతం ఆర్టీసీ సొంతంగా ఈ సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు. కార్గో, పార్సిల్ సేవల ద్వారా ఆర్టీసీ రెండేళ్లలో రూ.120.52 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని వెల్లడించారు. ఇప్పటి వరకు పార్సిళ్ల బట్వాడా ద్వారా రూ.88.68 కోట్లు, కార్గో రవాణా ద్వారా రూ.31.84 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. ఆర్టీసీ ప్రత్యేకంగా ఇంటింటికీ సేవలను ప్రారంభించిందని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కార్గో సేవలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని నగరాలకూ విస్తరించామని చెప్పారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.