తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ, సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని, కానీ నేడు ఆ సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు చెప్పుకొనేందుకు యూనియన్ లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ట్రాఫిక్ పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. గంటల తరబడి నిలబడటం వారికి సమస్యగా మారిందని, దీనికి పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీస్ వ్యవస్థలో షిఫ్ట్ సిస్టమ్ తీసుకొచ్చి వారికి ఉపశమనం కల్పించాలని కూనంనేని డిమాండ్ చేశారు.