RS Praveen Kumar | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ ఎత్తులు చిత్తయ్యాయి. బీజేపీ విరచిత చిత్రం తిరగబడింది. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసిన తెల్లారే బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తుపై శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులతో సమావేశమై రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆదివారం ప్రకటించారు. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే బీఆర్ఎస్లో చేరుతున్నానని తేల్చిచెప్పారు.
నిండు మనసుతో ఆశీర్వదించండి..
‘నేను నా రాజకీయ భవితవ్యంపై ఈ రోజు హైదరాబాద్లో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. ఆ సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ, నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడటం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం నేను రేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నాను. నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటూ.. వారి కలలను నిజం చేసే దిశగా పయనిస్తా. దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండి.. జై భీం జై తెలంగాణ… జై భారత్ ’ అంటూ నినదించారు.
తెలంగాణ ప్రయోజనాల పట్ల కమిట్మెంట్
బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతుండగా సుదీర్ఘకాలం పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసి (ఐపీఎస్) తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరుతుండటం ఆసక్తిగా నెలకొన్నది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తాను రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరినా, బీజేపీలో చేరాలనుకున్నా ఆ పార్టీలు ఆహ్వానిస్తాయి. ఆయనను ఆకాశానికి ఎత్తి కండ్లకు అద్దుకొని ఎక్కడ పోటీచేస్తానన్నా సీటు కేటాయిస్తాయి. అలాంటిది ఆర్ఎస్పీ బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకోవటం, తన చేరిక నేపథ్యాన్ని వెల్లడించటం అంటే ఆయనకు తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల పట్ల ఆయనకు ఉన్న కమిట్మెంట్కు నిదర్శమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.