నాటి ఉద్యమకాలంలో అనివార్యంగా నేను కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప.. ఇట్లా ఎట్లబడితే అట్ల అసభ్యంగా బూతు కూతలకు దిగలేదు. పరుష పదాలతో దురుసు మాటలతో తిట్టలేదు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఓడినా, గెలిచినా ఒక్కతీరుగా ఉండాలె.
అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది. ‘ఉన్నవి ఎలాగూ పోవు.. వచ్చేటాయన ఎక్కువిస్తాడేమోనని జనం ఆశకు పోయి మోసపోయిండ్రు. ఇప్పుడు వాస్తవం అర్థమవుతున్నది. మూణ్నెళ్లకే ముక్కు ఇరుస్తున్నరు. ఒకసారి ఓడితే నష్టమేమీలేదు. గాడిద వెంబడి పోతేనే కదా గుర్రాల విలువ తెలిసేది.
– కేసీఆర్
KCR | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చైతన్యాన్ని ఆగం కానివ్వబోమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బహుజన రాష్ట్ర సమితిగా తెలంగాణలోని దళిత, బహుజన వర్గాలకు గొంతుగా నిలుస్తుందని అన్నారు. కమిట్మెంట్తో ముందుకు సాగితే సాధించలేనిది ఏమీ ఉండదని తెలిపారు. తన రాజకీయ జీవితంలో 14 ఏండ్లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, 10 ఏండ్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల యోగక్షేమాల కోసం అహోరాత్రులు శ్రమించానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను తిన్నన్ని తిట్లు మరెవ్వరూ తినలేదని, తనను తిట్టినవారే తనదారికి వచ్చారని గుర్తుచేశారు. శూన్యం నుంచి సుడిగాలి సృష్టించామని వెల్లడించారు. సోమవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్ర సాధన అనంతరం నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలో నాటి సంస్థానాధీశులు, దేశ్ముఖ్లే గాంధీటోపీలు పెట్టుకుని ప్రజాప్రతినిధులయ్యారు. తెలంగాణ కోసం 1969 ఉద్యమంలో ములీ రూల్స్ కోసం పోరాటం సాగింది.
ముల్కీ నిబంధనలు కొనసాగించాలని ఏకంగా సుప్రీంకోర్టు చెప్పినా, జై ఆంధ్ర ఉద్యమం తెచ్చి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేశారు. 1969 నాటి ఉద్యమంలో 400 మంది అమరులయ్యారు. ఆ తర్వాత తెలంగాణ చైతన్యం ఆగమైంది. ఫలితంగా ఆ ఉద్యమం చల్లారింది. తెలంగాణపై ఆసక్తిపోయిన, ఆ అసహాయ పరిస్థితిలో అన్నీ పార్టీల్లో తెలంగాణ నాయకులు బానిసలయ్యారు. ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అణచివేతే ఉండేది. 1969 నుంచే నా మనసులో తెలంగాణ ఉన్నది. తెలంగాణ మీద ఆనాడు ఒక్కరికి కూడా సోయి లేకుండే తెలంగాణ కోసం పోదాం పా అంటే నువ్వంటవు గానీ అయితాదే అని వెనపట్లు పడేవాళ్లు’ అని తెలిపారు. రాజకీయాల్లో అనేక కష్టాలు వస్తాయని, వాటిని తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నేను తిన్న తిట్లు ఎవరూ తినలే. నా మీద దండకాలు కూడా రాసిండ్రు. ఎన్ని కష్టాలెదురైనా, ప్రలోభాలు పెట్టినా తెలంగాణ వాదాన్ని వదల్లేదు. సందర్భం వచ్చినపుడు అవసరమైన పంథాను ముందుపెట్టి తెలంగాణ కోసం పోరాటంలో కేంద్రాన్ని గజ్జున వణికించాం. శూన్యం నుంచి సుడిగాలిని సృష్టించినం. అనేక సమస్యలను ఎదుర్కొన్నం. ఎదురొడ్డి నిలిచినం’ అని వెల్లడించారు. అలాగే ఉమ్మడి పాలనలో తెలంగాణకు కరెంట్ సహా అన్ని రంగాల్లో జరిగిన వివక్షపై తాను చేసిన పోరాటాలను, ఎన్టీఆర్ హయాంలో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా పరిష్కరించిన సమస్యలను, ఎదురు నిలిచిన సందర్భాలను కేసీఆర్ వివరించారు.
సంక్షేమమే అక్కర్లేదన్నది చంద్రబాబు ఆలోచన
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రపంచబ్యాంకు ఆర్థిక సంసరణలు అమలుచేయాలని చూసేవారని కేసీఆర్ తెలిపారు. ‘ప్రజలకు తాగునీరు, విద్యుత్తు, సంక్షేమం అకరలేదనే భావనతో చంద్రబాబు ఉండేవారు. ఆ పర్యవసానాల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెరిగాయి. ఆ పెంచిన విద్యుత్తు చార్జీలకు వ్యతిరేకంగా స్పందించా. డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశా. నాడు విద్యుత్తు ఉద్యమకారులను కాల్చిచంపిన దుర్మార్గమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక విజ్ఞప్తులు చేసినా నిర్లక్ష్యమే ఎదురయ్యేది’ అని వెల్లడించారు. 1969 నాటి వైఫల్యాలు తిరిగి రావద్దని, 1969 నాటి ఉద్యమకారులతో చర్చించి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టానని చెప్పారు. ‘ఇది స్ట్రీట్ ఫైటా.. స్టేట్ ఫైటా’ అని అడిగానని, వారికి తెలంగాణ రాష్ట్ర సాధనే అసలైన పరిష్కారం అని చెప్పి ముందుకు సాగామని తెలిపారు. పార్లమెంట్లో చట్టం ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యం అవుతుందని, అదే పంథాలో ముందుకు సాగామని వివరించారు.
ఆరెస్సెస్ నుంచి ఆర్ఎస్యూ దాకా
తెలంగాణ కోసం ఆరెస్సెస్ నుంచి ఆర్ఎస్యూ వరకు అందరినీ కలిశామని, దేశంలోని 36 రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చామని కేసీఆర్ వివరించారు. తన కేంద్ర మంత్రి పదవిని తెలంగాణ సాధన కోసం ఉపయోగించానని వెల్లడించారు. ‘తెలంగాణ కోసం కలిసిన ప్రతి ఒక్కరికి స్టిల్ సీకింగ్ జస్టిస్ అనే వీడియో డాక్యుమెంటరీని చూపించేవాడిని. నన్ను సూడంగనే మల్లా వచ్చిండ్రా అని జోకులు వేసుకునేవాళ్లు. కానీ తెలంగాణ కోసం మన పట్టుదల చూసి అంతా మద్దతు ఇచ్చారు’ అని తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి దగ్గరికే 18 సార్లు వెళ్లానని పేర్కొంటూ ‘మీ బహుజన్ కాజ్ నా తెలంగాణ కాజ్ ఒకటే’ అని ఆమెకు చెప్పి తెలంగాణకు మద్దతు లేఖ సంపాదించిన విషయాన్ని గుర్తుచేశారు.
దేశానికి సరికొత్త ఎజెండాను తయారుచేద్దాం
బహుజన సిద్ధాంతంపై ఇంకా లోతైన చర్చ జరగాలని, దీనిపై స్పష్టమైన అవగాహన వచ్చేదాకా కమిట్మెంట్తో ముందుకు సాగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కోటానుకోట్ల బహుజనులకు చైతన్య స్రవంతి కోసం ఆలోచన చేసిన బుద్ధిజీవులు అదే పంథాలో ముందుకుపోవాలని అన్నారు. ఒక్కసారి కమిట్ అయ్యాక వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పారు. ఈ మధ్యకాలంలో జరిగిన సమీక్షల్లో కొంతమంది దళితబంధు వద్దు అంటే తనకు ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. దళితబంధు వల్ల పార్టీ నష్టపోయిందన్న భావన కొంతమందిలో ఉన్నదని, అయితే అది సరైన ఆలోచనా విధానం కాదని స్పష్టం చేశారు. దళితబంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయని ఉదహరించారు. దళిత సమాజం దళితబంధు పథకాన్ని పాజిటివ్గా ఎందుకు తీసుకోలేకపోయిందో బహుజన యువ మేధావులు విశ్లేషించాలని కోరారు. దళితశక్తితో పాటు బహుజన శక్తి కలిసిపోవాలన్న సిద్ధాంతం కోసం కాన్షీరాం పోరాటం చేశారని గుర్తుచేశారు. ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. బహుజనుల్లో సామాజిక చైతన్యస్థాయిని మరింత పెంచాల్సి ఉన్నదని వెల్లడించారు. ‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళితుల మీదే దాడులు జరుగుతున్నాయి. పాలకుల మీద ఐకమత్యంతో పోరాటం చేసి హకులు సాధించుకోవాలి. ఈ విషయంలో అగ్రవర్ణ పేదలను కలుపుకొని పోవాలి. ప్రతీపశక్తుల మీద పోరాటం చేస్తున్న క్రమంలో కలిసివచ్చే శక్తులను కలుపుకోవాలి. సమాజంలో 20 శాతం ఉన్న దళితులు ఐక్యంగా నిలిస్తే సాధించలేనిది ఏదీ లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నూతన సచివాలయాన్ని నిర్మించలేదు. అలాంటిది దేశానికే తలమానికంగా తెలంగాణ నూతన సచివాలయం నిర్మించి దానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టుకున్నాం. తెలంగాణ తర్వాతే మరే రాష్ట్రమైనా అనే రీతిలో 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించుకున్నాం. దళిత శక్తిని, బలహీన వర్గాలను ఐక్యం చేసేందుకు అందరం నడుం కడదాం. ఈ దేశానికి సరికొత్త ఎజెండాను తయారు చేద్దాం’ అని పిలుపునిచ్చారు.
యువ నాయకత్వం ఎదగాలె
తెలంగాణ యువ నాయకత్వం ఎదగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ‘మీ లాంటి (పార్టీలో చేరిన వారిని వారిని ఉద్దేశించి) యువత నాయకత్వం ఎదిగితే, అవకాశవాదంతో పార్టీలోకి వచ్చిపోయే స్వార్థపరుల అవసరం ఉండదు. వచ్చే ఎన్నికల వరకు మీరంతా నాయకులుగా ఎదగాలె’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రం సాధించాక రైతాంగాన్ని దరికి తేవాలని సాగునీటి ప్రాజెక్టులను తెచ్చామని తెలిపారు. అన్నమో రామచంద్రా అని అలమటించిన నా తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తిని సాధించిందని పేర్కొన్నారు. అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చిందని వెల్లడించారు.
కాంగ్రెస్ పాలనేంటో ప్రజలకు తెలిసిపోయింది
ఉద్యమకాలంలో సమైక్య పాలకులకు తొత్తులుగా ఉన్న నాయకులను కొన్ని మాటలు అనాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాష్ర్టాన్ని సాధించిన తరువాత తాను ఏనాడూ ఎట్లాపడితే అట్లా మాట్లాడలేదని కేసీఆర్ గుర్తుచేశారు. ‘ఎట్లబడితే అట్లా అసభ్యంగా బూతుకూతలకు దిగలె. పబ్లిక్ లైఫ్ ఉన్నప్పుడు ఓడినా, గెలిచినా ఒకతీరుగా వుండాలె. మన ప్రజలు-మన రాష్ట్రం అన్న పద్ధతిలో ముందుకుసాగాలె. అధికారం ఉంటే ఒకతీరు, లేకుంటే ఒక తీరు ఉండొద్దు’ అని అన్నారు. ‘కేసీఆర్ తెచ్చిన పథకాలు ఎక్కడికిపోవు. వచ్చేటాయిన ఎకువిస్తాడేమోనని ఆశకు పోయి మోసపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు నమ్మి అటు మళ్లిండ్రు. ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థం అవుతున్నది. ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు. గాడిది ఎంబటి పోతేనే కదా గుర్రాల విలువ తెలుస్తది’ అని చెప్పారు. కష్టపడితే వచ్చే టర్మ్లో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పాలన మీద ప్రజలు మూడు నెలల్లోనే ముక్కు ఇరుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కనీసం మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అర్థం కావటం లేదని తెలిపారు.
బహుజన సిద్ధాంతమే పునాదిగా
దళిత, బహుజన సిద్ధాంతమే ఎజెండాగా ముందుకు సాగుదామని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీకి లేనంత స్పేస్ బీఆర్ఎస్లో ఉన్నదని చెప్పారు. త్వరలో బీఆర్ఎస్ను క్షేత్రస్థాయి నుంచి నిర్మించుకుందామని తెలిపారు. నిరంతర శిక్షణ తరగతులు నిర్వహించుకుందామని వెల్లడించారు. పార్టీలో అన్ని స్థాయిల్లో కమిటీలు వేద్దామని, తెలంగాణ నుంచే బహుజన బేస్ నిర్మిద్దామని, బహుజన హితాయ సుఖాయ నానుడికి తెలంగాణ నుంచే అంకురార్పన చేద్దామని అన్నారు. ఇక్కడి నుంచే యావత్తు దేశానికి బీఆర్ఎస్ టార్చ్బేరర్గా పనిచేయాలని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్పీ!
మంచి ఆశయం కోసం రాజకీయాల్లో వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను హృదయపూర్వకంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నానని, ఆయన భవిష్యత్తులో ఉన్నతస్థానంలో ఉంటారని కేసీఆర్ ప్రకటించారు. మంచి ఆశయం కోసం పనిచేసినవారికి మంచి రాజకీయ, సామాజిక ఫలితాలుంటాయని చెప్పారు. ఆచరణయోగ్యమైన కార్యాచరణతో కలిసి పనిచేద్దామని తెలిపారు. డెడికేటెడ్గా పనిచేసే వ్యక్తి ప్రవీణ్కుమార్ అని, గురుకుల విద్యను అభివృద్ధి చేసే క్రమంలో ప్రవీణ్కు ఎంతో సహకరించానని గుర్తుచేశారు. ఫలితంగా ఎంతోమంది బహుజన బిడ్డలను విద్యావంతులను చేశారని, దేశ, విదేశాల్లో వాళ్లు ఇవ్వాళ ఉన్నతస్థాయిలోకి వచ్చారని వివరించారు. దేశ గురుకుల విద్యావ్యవస్థలో తెలంగాణను ఆదర్శంగా నిలిపారని కొనిడాయారు. గొప్ప ఆశయంతో బీఆర్ఎస్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీమంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, మెతుకు ఆనంద్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అంజయ్య, గువ్వల బాలరాజు, మాజీ చైర్మన్లు రవీందర్సింగ్, బాలరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు: నిరంజన్రెడ్డి
నాడు సీతమ్మ తల్లి ఒకసారే అగ్నిపరీక్ష ఎదుర్కొన్నారని.. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి దాకా కేసీఆర్ అనేక అగ్నిపరీక్షలను ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఎర్రవల్లిలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరిక సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వాదమే బహుజన వాదమని, రెండూ వేర్వేరు కాదని తెలిపారు. మీడియా దుష్ప్రచారంలో ప్రజలు ప్రభావితమై తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి కాంగ్రెస్ పాలనలో పరిస్థితులను చూసి ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని వెల్లడించారు. అందరం కలిసొచ్చే అన్ని సిద్ధాంతాలతో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అంతా కలిసికట్టుగా నాగర్కర్నూల్ ఎంపీ సీటును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు. ఉన్నవాళ్లు కష్టకాలంలో స్వార్థంతో పకకుపోతుంటే, బయటినుంచి ప్రవీణ్కుమార్, బీఎస్పీ రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు వచ్చి బీఆర్ఎస్లో కలుస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
పసిబిడ్డకు శ్రేయా ఫూలే అని పేరుపెట్టిన కేసీఆర్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు అకినేపల్లి శిరీష-ప్రవీణ్ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రేయా ఫూలేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామకరణం చేశారు.
ఎంత ప్యాకేజీ తీసుకున్నావని చాలామంది అడుగుతున్నారు. నేను ప్యాకేజీ తీసుకునేవాడిని అయితే, అధికార పార్టీ గేట్ల దగ్గర కూర్చొనేవాడిని కదా. నేను ప్రశ్నించడానికి వచ్చినవాడిని. తెలంగాణ పునర్నిర్మాణం అనే యజ్ఞంలో భాగస్వామ్యం కావటం కోసం వచ్చాను. దొంగ ఆస్తులను రక్షించుకుందామని వచ్చినవాడిని కాదు. భయంతో వేరే పార్టీలో చేరేవాడిని అంతకంటే కాదు. ముఖ్యమంత్రి గేట్లు తెరిస్తే చాలామంది పిరికిపందలు, అసమర్థులు, స్వార్థపరులు గొర్రెల్లా ఉరుకుతున్నరు. ఆ గొర్రెల మందలో ప్రవీణ్కుమార్ ఒకడు కాడు.
– ఆర్ఎస్ ప్రవీణ్కుమార్