RS Praveen Kumar | సీఎం రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని.. దాడులకు బెదిరేది లేదని.. మాఫియాలను రాజ్యాంగబద్ధంగా కుప్పకూల్చే దాకా నిద్రపోనివ్వం ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. వనపర్తి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి గురువారం హత్యకు గురయ్యారు. హత్యాకాండపై ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. సీఎం, మంత్రి అండతో బీఆర్ఎస్ నాయకులపై పట్టపగలే దాడులు జరుగుతున్నాయని.. ప్రాణాలకు పెను ప్రమాదం పొంచి ఉందని డీజీపీకి ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యారన్నారు.
ఇది ముమ్మాటికి రాజకీయ హత్యేనని.. తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదని పక్కా ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం హత్యల సంస్కృతికి తెరలేపిందని మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదని.. ప్రతీకార పాలన అంటూ మండిపడ్డారు. మంత్రి అండదండలతో యథేచ్చగా జరుగుతున్న దాడుల్లో అధికార పార్టీ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిని పీడీ యాక్ట్ లాంటి చట్టాలను ప్రయోగించి జైల్లో పెట్టకపోవడంతోనే ఇలాంటి వరుస హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిందితులతో కుమ్మక్కైతున్న కొందరు స్థానిక పోలీసు అధికారులను, ఎంతటి వారైనా సరే, వారిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి తప్పకుండా శిక్షించడంతో పాటు బదిలీ చేయాలన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని.. కొల్లాపూర్, నాగర్ కర్నూల్ , అచ్చంపేట నియోజవర్గాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో వెంటనే కేంద్ర బలగాలు, స్పెషల్ పోలీసు బలగాలతో పికెట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణాలకు ముప్పున్న బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు వెంటనే రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్రంలో అడుగంటిన శాంతిభద్రతలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.