వరంగల్, మహబూబాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చేరుకుంటారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి కేటీఆర్ ప్రారంభిస్తారు. తర్వాత జరిగే సభలో ప్రసంగిస్తారు.
అనంతరం తొర్రూరులో నిర్మించిన సమీకృత వెజ్, నాన్వెజ్ మోడల్ మార్కెట్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు యతిరాజారావు మెమోరియల్ పార్కు, ఓపెన్ జిమ్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు అక్కడే ఏర్పాటు చేసే సభలో మహిళా సహాయక సంఘాలకు రూ.750 కోట్ల వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నారు. అలాగే అభయహస్తం డబ్బులను పంపిణీ చేస్తారు. 20 వేల మంది మహిళలతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు తొర్రూరు నుంచి హైదరాబాద్కు హెలికాప్టర్లో తిరిగి బయల్దేరుతారు.