హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : జాతీయ లోక్ అదాలత్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా రూ.45.21 కోట్లు సైబర్ నేరాల బాధితులకు రీఫండ్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ, బ్యాంకులు, డిజటల్ పేమెంట్ల ప్రొవైడర్లు, రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా పోలీస్ యూనిట్ల సమన్వయంతో ఈ రీఫండ్ను చేపట్టినట్లు పేర్కొన్నారు. లోక్అదాలత్ ద్వారా 6,303 మంది బాధితులకు రూ.45.21 కోట్లు అందించి వారికి ఆర్థిక ఉపశమనం కల్పించినట్లు తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 2,232 మందికి రూ.21.91 కోట్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి 77 మందికి రూ.6.83 కోట్లు, మలాజిగిరి నుంచి 779 మందికి రూ.4.04 కోట్లు, హైదరాబాద్ నుంచి 755 మందికి రూ.3.22 కోట్లు, సంగారెడ్డి నుంచి 167 మంది బాధితులకు రూ.1.69 కోట్లు రీఫండ్ చేసినట్టు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన లోక్ అదాలత్ల ద్వారా 59,953 మంది బాధితులకు మొత్తం రూ.445.41 కోట్లు తిరిగి ఇప్పించినట్టు వెల్లడించారు. 2023లో రూ. 8.36 కోట్లు, 2024లో రూ.183.9 కోట్లు, 2025లో రూ.182.9 కోట్లు, 2026 జూన్ 20 వరకు రూ.70.07 కోట్లు రీఫండ్ చేశామని తెలిపారు.