Stree Nidhi | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి పథకం కింద ఈ ఏడాది రూ.3,078 కోట్లు రుణాలుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో రూ.2710 కోట్ల మొత్తాన్ని బ్యాంకు లింకేజీ ద్వారా, ఇతర పథకాలకు రూ.368 కోట్లను ఇవ్వాలని నిర్దేశించింది. స్త్రీనిధి ద్వారా 2023-24 సంవత్సరంలో చేపట్టే పథకాల లక్ష్యాలను మంగళవారం అధికారులు విడుదల చేశారు. బ్యాంకు లింకేజీతో మెప్మా పరిధిలో రూ.813 కోట్లు, సెర్ప్ పరిధిలో రూ.1897 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. బ్యాంకు లింకేజీతో పాటు వివిధ ప్రత్యేక పథకాల కింద 63,650 మంది లబ్ధిదారులకు మరో రూ.368 కోట్ల రుణాన్ని ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో 10 వేల యూనిట్ల పాడి బర్రెలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం రూ.93 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇండ్లలో 10 వేల సోలార్ యూనిట్ల ఏర్పాటుకు రూ.150 కోట్లను రుణంగా అందిస్తారు. గొర్రెల పెంపకం తరహాలో పొట్టేలు పిల్లల కొనుగోలుకు రూ.85 వేల చొప్పున వెయ్యి మందికి రుణాలు అందించనున్నారు. కోళ్ల పెంపకం, కోడిపిల్లల ఉత్పత్తి, ఎలక్ట్రిక్ ఆటోల కోసమూ రుణాలు అందించనున్నారు.