sukesh chandrasekhar | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): అతడు పెద్ద పొలిటీషియన్ కాదు. పెద్ద బిజినెస్మెన్ కాదు. పెద్ద ఆఫీసర్ కాదు. సెలబ్రిటీ అంత కన్నా కాదు. అయినా తన చుట్టూ పొలిటీషియన్లను తిప్పుకోగలడు. బిజినెస్మెన్లను ఆడించగలడు. అధికారులను బఫూన్లను చేయగలడు. ఇన్ని విద్యలు, ఇంతటి చావు తెలివితేటలు ఒక వ్యక్తిలో ఉండటం చాలా అరుదు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడో పెద్ద జాదూగర్. అతడి పేరే సుకేశ్ చంద్రశేఖర్. ఈ మధ్యకాలంలో జాతీయ మీడియాలో బాగా నానుతున్న పేరు ఇది. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు ప్రస్తావించి మీడియా అటెన్షన్ను తన వైపు తిప్పుకోవడంలో దిట్ట. ఆయన చరిత్ర ఒక మోసాల పుట్ట. ఇతడి మాటలకు ఎంతటివాడైనా మోసపోవాల్సిందే. ఇతడి వల్ల మోసపోని రంగం లేదు. ప్రస్తుతం తీహార్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు.
ఊచలు లెక్కపెడుతున్నాడు అనేకంటే జైలును అడ్డాగా చేసుకొని దందాలు చేస్తున్నాడనటం కరెక్ట్. అతని షూ ఖరీదు రూ.2 లక్షలు. ఇంట్లో వేసుకునే చెప్పుల ధర రూ.1.5 లక్షలు. మొబైల్ ఖరీదు రూ.లక్షా 10 వేలు, జీన్స్ ఒక్కోటి రూ.40 వేలు. గర్ల్ల్ఫ్రెండ్కు గిఫ్ట్గా ఇచ్చే వ్యానిటి బ్యాగ్ ధర రూ.5-6లక్షలు. ఇంత లగ్జరీ లైఫ్ గడుపుతున్నా.. అతడికేమీ వేల, లక్షల కోట్ల ఆస్తిపాస్తులు లేవు. మాయమాటలు చెప్పో, బ్లాక్మెయిల్ చేసో రూ.కోట్లు కొల్లగొట్టడం అతడి హాబీ. ఎంతటి మోసగాడంటే.. ఒక కేసులో బెయిల్ రాకపోవడంతో జైలునే సొంతిల్లుగా మార్చుకొని లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. అదే జైలులో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన బడా ఫార్మా కంపెనీ యజమానికి బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి రూ.200 కోట్లు గుంజిన కేసులో జైలు జీవితం గడుపుతున్నారు. తీహార్ జైల్ నుంచే బ్లాక్మెయిలింగ్, సెటిల్మెంట్లు నెరుపుతున్నాడు. పెద్ద పెద్ద బిజినెస్మెన్లు, సెలబ్రిటీలు, పొలిటిషీయన్లను బ్లాక్మెయిల్ చేసి వందల కోట్లు గుంజుతున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
అతడి బ్లాయిమెయిల్ దందాలకు, సెటిల్మెంట్ల కోసం ప్రత్యేకసెల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని, హైఎండ్ స్మార్ట్ఫోన్లను జైలు అధికారులే సమకూర్చిపెట్టారు. ఒక్కో బ్యారక్లో 40 మంది ఖైదీలను ఉంచితే, సుకేశ్ చంద్రశేఖర్కు మాత్రం ప్రత్యేకంగా ఒక బ్యారక్ను కేటాయించారు. హోటల్ రూమ్ను తలపించే సౌకర్యాలు కల్పించారు. సౌకర్యాలు కల్పించినందుకు నెలకు కోటి-కోటిన్నర వరకు ఖర్చు పెట్టినట్టు బాహాటంగా ఆరోపణలు చేశాడు. 2020-21లో సుకేశ్కు జైలులో ప్రత్యేక బ్యారెక్ నెంబర్ 10 ఏర్పాటు చేసి ఇంటర్నెట్, ఐఫోన్ 12ప్రో లాంటి వసతులు కల్పించారు. అందుకు సుకేశ్ సన్నిహితుడు దీపక్ రామ్నాని నెలనెలా సూపరింటెండెంట్ సుందర్బోరాకు నెలకు రూ.1.5 కోట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ మహేంద్ర ప్రసాద్ సుందరియాల్ కు నెలకు రూ.25 లక్షలు చెల్లించాడు. కరోనా సమయంలో ప్రత్యేక వసతులు కల్పించారు. జైలు సూపరింటెండెంట్ చాంబర్ నుంచే వ్యవహారాలు నడిచాయి. అడిగినప్పుడల్లా కోర్టు వ్యవహారాల పేరిట జైలు నుంచి బయటికి తీసుకెళ్లేవారు. సుకేశ్ ఇచ్చిన డబ్బుతో జైలు అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు కూడబెట్టారు. ఫ్లాట్లు కొనుక్కున్నారు. జల్సాలు చేశారు. వారూ ఊచలు లెక్కబెడుతున్నారు.
మోసాలు ఇన్నిన్ని కావు
సుకేశ్ చంద్రశేఖర్పై ఓ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనం ప్రకారం.. సుకేశ్ మొదట ఢిల్లీలోని రోహిణి సెంట్రల్ జైలు నుంచే దందాలు నడిపాడు. అందుకు ప్రతిఫలంగా అప్పటి రోహిణి జైలులోని ముగ్గురు అధికారులు సుందర్ బోరా (జైలు సూపరింటెండెంట్), మహేందర్ ప్రసాద్ సుందరియల్ (జైలు డిప్యూటీ సూపరింటెండెంట్), ధరమ్ సింగ్ మీనా (జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్)లకు ప్రతినెలా పెద్ద మొత్తంలో మామూళ్లు చెల్లించాడు. తమిళనాడు సీఎం దివంగత జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే గుర్తు (రెండాకులు) ఇప్పిస్తానని టీటీవీ దినకరణ్ను నమ్మించి రూ.50 కోట్లు తీసుకొని మోసం చేశాడు.
రాజకీయ నాయకులపై ఆరోపణలు
సుకేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలు కేంద్రంగా పలువురు రాజకీయ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. గతంలో తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణనిధి కుమారుడిగా, దివంగత ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి మేనల్లుడిగా, పీఎంవో అధికారిగా, హోంశాఖ ఉన్నతాధికారిగా చెప్పుకొని పలువురిని మోసగించినట్టు అభియోగాలు ఉన్నాయి.
ఎవరీ సుకేశ్?
సుకేశ్ చంద్రశేఖర్ బెంగళూర్ వాసి. అతడి తండ్రి భవానీ విజయన్ చంద్రశేఖర్ ఒక రబ్బర్ కాంట్రాక్టర్. మధ్యతరగతి కుటుంబం. కానీ సుకేశ్ చంద్రశేఖర్ 17 ఏండ్ల వయసులోనే నిరుద్యోగులకు బెంగళూర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కోటిన్నర గుంజిన కేసుతో మోసాల దందాకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఒక్క బెంగళూర్లోనే అతడిపై 40 కేసులు నమోదయ్యాయి. మకాం ముంబైకి మార్చి వ్యాపార సామ్రాజ్యాన్ని 300 కేసులు.. రూ.600 కోట్లుగా మార్చుకున్నాడు. ప్రముఖ ఫార్మా కంపెనీ యజమాని శివిందర్ మోహన్సింగ్కు బెయిల్ ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ భార్య అదితి సింగ్ లీనా కూడా ఇదే జైలులో ఉన్నారు. లీనా మద్రాస్ కేఫ్ సినిమాలో నటించిన నటి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరాఫతేహీ లాంటి హిందీ హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయి. వీరిని పలుమార్లు ఈడీ విచారించింది.
ఆఫీసర్లకు 12.5 కోట్ల లంచం
సుకేశ్ తీహార్ జైల్లో 81 మంది అధికారులకు రూ.12.5 కోట్లు లంచంగా ముట్టిజెప్పినట్టు ఢిల్లీ క్రైం బాంచ్ విచారణలో తేలింది. మనీలాండరింగ్ కేసులో సుకేశ్ భార్య లీనాకు చెందిన 26 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకోవడానికి ఈడీ కోర్టు అనుమతించిందంటే.. ఇప్పటివరకు సుఖేశ్ కూడబెట్టిన డబ్బు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.