గొల్లపల్లి, ఆగస్టు 27: నాడు అంధకారంలో ఉన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపి, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేపోతున్నదని, కాంగ్రెస్ వస్తే రాష్ట్రం మళ్లీ అంధకారమే అవుతుందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లిలో రూ.2.30 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ సర్కారు ముందుకుసాగుతున్నదని తెలిపారు.
రైతు బంధు కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు, పంటకు సరిపడా నీళ్లు అందిస్తున్నామని వివరించారు. అనుకోని పరిస్థితుల్లో రైతు మృతిచెందితే కుటుంబాలు ఆగం కావద్దని రైతు బీమా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, లక్ష మంది ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నట్టు తెలిపారు. వృద్ధులకు రూ.3 వేలు, దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని ఉద్ఘాటించారు.