హైదరాబాద్ : దేశంలో ఎక్కడాలేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100కోట్లు కేటాయించిందని, నిధుల నిర్వహణ బ్యాధతను అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్కు అప్పగించిందని మంత్రి హరీశ్రావు అన్నారు. శాసన సభలో మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా 22వేల మంది న్యాయవాదులకు ఇన్సూరెన్స్ పాలసీలు అందించిందన్నారు. కరోనా సమయంలో 15వేల మందికిపైగా అడ్వకేట్లు, క్లర్కులకు రూ.25కోట్లును సహాయంగా అందించామన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.100కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు రూ.52కోట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీకి కేటాయించిందని, ఎవరైనా జర్నలిస్ట్ మరణిస్తే ప్రభుత్వం అతని కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ఈ నిధుల నుంచి అందిస్తుందన్నారు. శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.50 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
మరణించిన జర్నలిస్ట్ తల్లికి లేదంటే అతని భార్యకు ఐదేళ్ల పాటు ప్రతి నెలా రూ.3వేల చొప్పున పెన్షన్ అందజేస్తున్నామని, పిల్లలు ఉన్నటయితే అదనంగా రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నట్లు చెప్పారు. కరోనా బారినపడిన 4వేల మంది జర్నలిస్ట్లకు రూ.10వేలకు తగ్గకుండా ఆర్థిక సాయం అందించిందని, ఇందు కోసం రూ.5.68కోట్లను పంపిణీ చేసినట్లు వివరించారు. మహమ్మారి కారణంగా మృతి చెందిన 75 మంది జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రభుత్వం అందజేసిందని వివరించారు.