Compensation | హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలకు పెంచింది. స్వల్ప గాయాలైతే గతంలో చికిత్స ఖర్చులను మాత్రమే భరించేవారు. ఇకపై రూ.లక్ష వరకు చికిత్స ఖర్చు, రూ.10వేలు పరిహారంగా చెల్లిస్తారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్సతోపాటు రూ.75వేలు పరిహారంగా ఇస్తుండగా, ఇప్పుడు పరిహారాన్ని రూ.లక్షకు పెంచి, చికిత్స ఖర్చును రూ.3 లక్షలకు పరిమితం చేశారు.
పశువులు మరణిస్తే గతంలో పశువు విలువను పశుసంవర్ధకశాఖ అధికారి గణిస్తే, పరిహారం చెల్లించేవారు. ఇకపై ఆయనతోపాటు అటవీశాఖకు చెందిన సీనియర్ అధికారి, గ్రామ సర్పంచ్ కలిసి విలువ నిర్ణయిస్తారు. గరిష్ఠంగా రూ.50వేలు చెల్లిస్తారు. పంటనష్టానికి గతంలో రూ.6వేలు ఇవ్వగా, ఇకపై రూ.7500 చెల్లిస్తారు.
హార్టికల్చర్ పంటలు ధ్వంసం అయితే రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చే నివేదిక ప్రకారం రూ.7,500 నుంచి రూ.50వేల వరకు ఇచ్చేవారు. ఇకపై పరిహారంలో మార్పు లేకపోయినా, హార్టికల్చర్, రెవెన్యూ అధికారులు పంటనష్టంపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.