హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వెనకబడిన వర్గాల కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల జీవన ప్రమాణాలు పెంచటానికి కేసీఆర్ సరార్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న బీసీలకు లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పథకానికి అర్హులను ఎంపిక చేసి ప్రతినెలా 15న ఆర్థికసాయం అందిస్తారని వెల్లడించారు. శనివారం సచివాలయంలో మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ హాజరై రూ.లక్ష ఆర్థికసాయం పథకం తొలిదశ అమలుపై చర్చించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రూపొందించిన విధివిధానాలను క్యాబినెట్ సబ్కమిటీకి బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ సందర్భంగా వివరించారు. వాటిపై మంత్రివర్గ ఉపసంఘం సంతృప్తి వ్యక్తం చేసి, అధికారులకు పలు సూచనలు చేసింది. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ సబ్కమిటీ సమావేశ వివరాలను వెల్లడించారు. వెనకబడినవర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం తపిస్తారని వివరించారు. కులవృత్తిదారులు, చేతివృత్తిదారులకు ఆర్థిక చేయూతనిచ్చి భరోసా కల్పించాలనే సంకల్పంతోనే ప్రత్యేకంగా రూ.లక్ష సాయాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. శనివారం నాటికి 2,70,000 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మొదటగా అర్హతకలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదలకు అందజేస్తారని వివరించారు.
నెలరోజుల్లో గ్రౌండింగ్ పూర్తి కావాలి
ప్రతి నెలా 5లోగా కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని, ఇన్చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతి నెలా 15లోగా స్థానిక ఎమ్మెల్యేలు రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తారని మంత్రి గంగుల వెల్లడించారు. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు రూ.లక్ష సాయం కోసం సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కేవలం https://tsobmmsbc. cgg.gov.in వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఆ ఫారంను ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి అందజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లబ్ధిదారులు నెలరోజుల్లోగా తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామగ్రిని కొనుకోవాలని, ఆ నిర్ణయాధికారం పూర్తిగా లబ్ధిదారులదేనని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన యూనిట్ల ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. గ్రౌండింగ్తోనే వదిలిపెట్టకుండా, చేతివృత్తిదారుల నిరంతర అభివృద్ధిని అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. సమావేశంలో కార్మికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాణి కుముదిని, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్రాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.