కరీంనగర్/ నల్లగొండ, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చిన బీజేపీ, అడ్డదారులు తొక్కుతూ అనైతిక చర్యలకు దిగింది. పచ్చనోట్లు ఎరవేసి ఓటర్లను కొనుగోలు చేసేందుకు డబ్బుకట్టలను గుట్టలు గుట్టలుగా నియోజవర్గానికి తరలిస్తున్నది. సోమవారం ఒక్కరోజే మునుగోడు పోలీసులు ఓ బీజేపీ నేత కారు నుంచి ఏకంగా రూ.కోటి స్వాధీనం చేసుకోవటం కలకలం రేపింది. మునుగోడు పోలీస్స్టేషన్ పరిధిలోని చల్మెడ క్రాస్ రోడ్డు చెక్పోస్ట్ వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా, టాటా సఫారీ (టీఎస్ 02 ఎఫ్ హెచ్ 2425)లో ఈ డబ్బును గుర్తించారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తిని కరీంనగర్లోని 13 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ భర్త చొప్పరి వేణుగా గుర్తించారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు విజయవాడకు చెందిన రాము అనే వ్యక్తి నుంచి ఈ డబ్బును తీసుకొచ్చానని నిందితుడు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. తదుపరి విచారణ కోసం డబ్బును ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు. వేణును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.
బండి ప్రచారానికి ఒకరోజు ముందే కలకలం
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం నుంచి పాల్గొననున్నారు. ఆయన ప్రచారానికి ఒక్కరోజు ముందు బండికి అత్యంత సన్నిహితుడే స్వయంగా భారీ మొత్తంలో డబ్బులు అక్కడి చేరవేయటానికి ప్రయత్నించటం కలకలం రేపుతున్నది. చొప్పరి జయశ్రీ బీజేపీ కార్పొరేటర్ మాత్రమే కాదు. ఆమె కరీంనగర్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కూడా. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో గెలుపు కోసం నేరుగా బీజేపీ నేతలే బరితెగించి డబ్బులు చేరవేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘కుదిరితే ఓటర్లను కొనాలి.. లేదంటే ఎమ్మెల్యేలను కొనాలి’ అనేదే బీజేపీ నినాదంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలంతా తమవైపే ఉన్నారని గప్పాలు కొట్టుకొంటున్న బీజేపీ నేతలు.. ఇలా కోట్లకొద్దీ డబ్బులు ఎందుకు ఎరవేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చిల్లర పనులు అని ఎద్దేవా చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కాంట్రా క్టర్ అహంకారానికి, ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్నదని టీఆర్ఎస్ శ్రేణులు మొదటినుంచి చెప్తున్నాయి. 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక తీసుకువచ్చారని ఆరోపిస్తున్నాయి. వీటిని బలపరిచేలా మునుగోడులో బీజేపీ నేత కారులో రూ. కోటి పట్టుబడింది. తాము మొదటినుంచి చెప్తున్నదే నిజమైనదని టీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడు!
డబ్బుతో పట్టుబడిన చొప్పరి వేణుకు వివేక్తో అంతగా సాన్నిహిత్యం లేదు. అతడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడని తెలిసింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కనుసన్నల్లో మెలుగుతుంటాడని అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చొప్పరి వేణు దంపతులు ఈటల తరఫున భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత ప్రాథమిక విచారణలో మాత్రం వివేక్ ఆదేశాల మేరకే డబ్బు తీసుకొచ్చినట్టు వేణు తెలిపాడు. సన్నిహితంగా లేని వేణుకు వివేక్ డబ్బులు ఇచ్చారా? లేక అత్యంత సన్నిహితంగా ఉండే ఈటల రాజేందర్ ఇచ్చారా? అన్నది తేలాల్సి ఉన్నది. కాగా సోషల్మీడియాలో మాత్రం దీనికి భిన్నంగా చర్చ సాగుతున్నది. పోలీసుల తనిఖీలో పట్టుబడిన వాహనం హైదరాబాద్ నుంచే బయలుదేరిందని, డబ్బులు హైదరాబాద్లోనే సమకూర్చారని అంటున్నారు. ఇలా డబ్బులు తరలించటం తరచూ జరుగుతూనే ఉన్నదని పేర్కొంటున్నారు.