హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఫార్మా సంస్థ ‘రోచె’ తన గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను విస్తరించింది. హైదరాబాద్లో రెండవ డాటా అనలిటిక్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. డాటా సైన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ సంబంధిత సామర్థ్యాల అభివృద్ధికి హైదరాబాద్లో వ్యూహాత్మక పెట్టుబడి పెట్టనున్నది. దీనిలో భాగంగా రోచే ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో వీ సింప్సన్ ఇమ్మాన్యుయేల్ సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల స్థాపన కోసం రోచె ఫార్మా హైదరాబాద్ను ఎంచుకోవడం రాష్ర్టానికి గర్వకారణమన్నారు. హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ వ్యాపార పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉన్నదని, ఇక్కడ అత్యంత ప్రతిభావంతులైన నిపుణులతోపాటు అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
గ్లోబల్ ఇన్నోవేషన్, క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదన్నారు. వినూత్నమైన డాటా ఆధారిత పరిషారాలను అందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్లో ‘గేట్’ను ఏర్పాటు చేశామని, భారత్లో ఇది రెండవదని సింప్సన్ ఇమ్మాన్యుయేల్ తెలిపారు. తాజా విస్తరణలో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి 100 మంది ఉద్యోగులను నియమించుకోవడంతోపాటు ‘గేట్’ను మరింతగా విస్తరించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ పాల్గొన్నారు.
రోచె చైర్మన్తో మంత్రి కేటీఆర్ భేటీ ఫలితమే
స్విట్జర్లాండ్లోని బాసెల్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న రోచె సంస్థ చైర్మన్ క్రిస్టోఫ్ ఫ్రాంజ్తో మంత్రి కేటీఆర్ ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారు. 2020లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం సందర్భంగా, ఆ మరుసటి ఏడాది మేలో ఈ భేటీలు జరిగాయి. హైదరాబాద్లో ఫార్మా, లైఫ్ సెన్సెస్ రంగాలకున్న అత్యంత అనుకూల పరిస్థితుల గురించి ఈ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ వివరించారు. దీని ఫలితంగానే ఆ కంపెనీ తాజాగా హైదరాబాద్లో తమ సేవలను విస్తరిస్తున్నది. ఆంకాలజీ, ఇమ్యునాలజీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ఆప్తల్మాలజీ , కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు మందులను తయారు చేయడంలో రోచె ఎంతో ఖ్యాతి పొందడంతోపాటు విట్రో డయాగ్నస్టిక్స్, టిష్యూ-బేస్డ్ క్యాన్సర్ డయాగ్నస్టిక్స్లో ప్రపంచ అగ్రగామిగా ఉన్నది. 1896లో ఏర్పాటై ప్రస్తుతం దాదాపు 62 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కలిగి ఉన్న ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికిపైగా ఉద్యోగులున్నారు.