హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): కత్తిగాట్లు లేకుండా.. యూనిట్ల కొద్దీ రక్తం వాడకుండా.. సంక్లిష్టమైన గాల్బ్లాడర్, హెర్నియా, అచలాసియా కార్డియా సర్జరీలు చిన్న రంధ్రంతో సులువుగా సక్సెస్ అవుతున్నాయి. దవాఖానల్లో కేసీఆర్ సర్కారు అత్యాధునిక వైద్యసేవలు తీసుకురావడంతో ఖరీదైన శస్త్రచికిత్సలు సైతం పేదలకు ఉచితంగా అందుతున్నాయి. నిమ్స్లో ఇటీవలే రోబోటిక్ సర్జరీలు ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల్లోనే పది సర్జరీలు విజయవంతమయ్యాయి. మూడు రోజుల్లోనే రోగులు డిశ్చార్జి అయ్యారు.
గత నెలలో రూ.32 కోట్లతో అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో కూడిన రోబో యంత్రాన్ని ప్రభుత్వం నిమ్స్ దవాఖానకు అందించింది. చాలా అడ్వాన్స్డ్ పరిజ్ఞానం ఉన్న ఈ రోబో ప్రభుత్వ వైద్య రంగంలోనే మొదటిది. తొలి సర్జరీని సర్జికల్ గ్యాస్ట్రో నిపుణుడు, నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప చేశారు. ప్రొఫెసర్ బీరప్ప పర్యవేక్షణలో సర్జికల్ గ్యాస్ట్రో అదనపు ప్రొఫెసర్ డాక్టర్ వేణుమాధవ్ తమ బృందంతో కలిసి క్లిష్టమైన మూడు గాల్బ్లాడర్ సర్జరీలు, ఒక హెర్నియా సర్జరీ, అచలాసియా కార్డియా సర్జరీలు చేశారు. యూరాలజీ విభాగానికి సంబంధించి ఐదు రొబొటిక్ సర్జరీలు జరిపారు. అందులో 3 నెప్రెక్టమిస్ సర్జరీలు, ఒకటి పైలోప్లాస్టి, వెసైకో వెజినల్ ఫిస్టుల్లా రిపేయిర్ సర్జరీలు ఉన్నాయి.
క్యాన్సర్ సర్జరీలు చేస్తాం
‘నిమ్స్లో ప్రధానంగా సర్జికల్ గ్యాస్ట్రో, సర్జికల్ యూరాలజీ, సర్జికల్ అంకాలజీ విభాగాల శస్త్రచికిత్సలను రోబొటిక్ ద్వారా జరుపుతున్నాం. ప్రస్తుతం శస్త్రచికిత్స పూర్తిచేసుకున్న 10 మంది రోగులు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. రోబో ద్వారా శస్త్రచికిత్సలు చేయడానికి 20 సర్జన్స్కు శిక్షణ కల్పిస్తున్నాం. ఇందులో ఇప్పటికే ఇద్దరు శిక్షణ పూర్తి చేసుకుని సర్జరీలు చేస్తున్నారు. మూడు నాలుగు రోజుల్లో క్యాన్సర్ సర్జరీలను కూడా రోబో ద్వారా ప్రారంభించబోతున్నాం. ఈ రోబోతో ఎలాంటి కోత లేకుండానే చిన్నపాటి రంధ్రం ద్వారా ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు.
– నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప
3 రోజుల్లోనే డిశ్చార్జి చేశాం
‘రోబొటిక్ సర్జరీలను ప్రారంభించిన 6 రోజుల్లోనే 10 సర్జరీలు సక్సెస్ఫుల్గా చేశాం. రోబో సర్జరీలకు కార్పొరేట్లో రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, నిమ్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా పైసా ఖర్చులేకుండా ఉచితంగానే చేశాం. సాధారణ పద్ధతుల్లో చేసే సర్జరీస్తో పోల్చితే రోబొటిక్ సర్జరీలు చాలా కచ్చితంగా ఉన్నాయి. ముఖ్యంగా రోగికి బ్లడ్ లాస్ లేదు. కోత లేనందున నామమాత్రపు రక్తస్రావమే ఉంటుంది. నొప్పి కూడా తక్కువ. ఇక ఇన్ఫెక్షన్స్ దాదాపు ఉండ వు. ఇన్ఫెక్షన్స్ లేనప్పుడు రోగికి ఇతర దుష్ప్రభావాలు, అనారోగ్య సమస్యలు రావు. ప్రతి రోగి కేవలం 3 రోజుల్లోనే డిశ్చార్జి అయ్యారు.
– డాక్టర్ రాహుల్ దేవరాజ్