వేల్పూర్, ఫిబ్రవరి 25: బీజేపీ దేవుడి పేరు చెప్పి దేశాన్ని నిలువునా దోచుకుంటున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కార్పొరేట్లకు రుణమాఫీ, 5జీ స్పెక్ట్రమ్ విక్రయాల్లో రూ. 22 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఇలా అప్పనంగా వచ్చిన డబ్బుతో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతున్నారని ఆరోపించారు. దేశంలో మోదీ అవినీతి, అరాచక పాలనపై పోరాడుతున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని తెలిపారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది శనివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వేముల గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశ ప్రజలపై బీజేపీ సర్కార్ అప్పుల భారం మోపిందని అన్నారు. మోదీ కంటే ముందున్న 13 మంది ప్రధానులు రూ.55 లక్షల కోట్ల అప్పు చేస్తే మోదీ ఒక్కడే 8 ఏండ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పు చేశాడని ఆరోపించారు. మరోవైపు చైనా, మన దేశ సరిహద్దులు దాటి వస్తున్నా ఏమి చేయలేకపోతున్నారని, విదేశాంగ మంత్రి బాధ్యతారాహిత్యంగా చైనాతో ఇప్పుడు పెట్టుకోలేమని మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
ఎవడబ్బ సొమ్మని తమ కార్పొరేట్ మిత్రులకు మేలు చేసి, దేశ ప్రజల మీద భారం వేశారని మంత్రి వేముల నిలదీశారు. సామాన్య ప్రజలు చిన్నపాటి రుణం తీసుకుంటే బ్యాం కులు ముక్కుపిండి వసూలు చేస్తాయని, కానీ మోదీ తన కార్పొరేట్ మిత్రులు తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని విమర్శించారు. ఇప్పటికే 12 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోశారని మండిపడ్డారు. రూ. వేల కోట్ల ఎల్ఐసీ ప్రీమియం డబ్బులను కూడా పక్కదోవపట్టించిన ఘనత మోదీదేనని ఆయన స్పష్టం చేశారు. అదానీ కేవలం 8 ఏండ్లలో రూ.45 వేల కోట్ల నుంచి రూ.11 లక్షల కోట్లకు ఎలా పడగలెత్తిండని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి దమ్ముంటే అదానీపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రధాని ప్రశ్నించిన అందరిపైనా సీబీఐని ప్రయోగిస్తున్నారని మంత్రి వేముల ఆరోపించారు. తనలాంటి వారిపై కూడా వేధింపులు ప్రారంభిస్తారని తెలిపారు. కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తుందని ఒక మామూలు బీజేపీ ఎంపీ ఎలా డిసైడ్ చేస్తాడని ప్రశ్నించారు. 5జీ స్పెక్ట్రమ్ రూ.1.48 లక్షల కోట్లకే అమ్మి రూ.10 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
బాల్కొండ నియోజకవర్గం తిమ్మాపూర్లో ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వేముల ఘాటుగా స్పందించారు. అర్వింద్ నోరు విప్పితే అబద్ధాలు, బూతులేనని, ఆయన వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. అభివృద్ధికి అర్వింద్ ఏమిచ్చాడో, కేంద్రం నుంచి ఏం తెచ్చాడో చెప్పిన తర్వాతే గ్రామాల్లో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.