వేల్పూర్/తిరుమలగిరి, మే 19: సీఎం కేసీఆర్ సంపదను సృష్టిస్తూ ఆ ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారులు, పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దీంతో లక్షల కోట్లు నేరుగా ప్రజలకు చేరాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే తెలంగాణ సాధించిన ప్రగతి విజయాలపై రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను కేసీఆర్ కుటుంబ ఉత్సవాలుగా పేర్కొనడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం క్లస్టర్ 2 గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం వేల్పూర్ మండలం లక్కోర సమీపంలోని ఏఎన్జీ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. సమ్మేళనానికి మంత్రి తన సతీమణి నీరజారెడ్డితో కలిసి హాజరయ్యారు. కార్యకర్తలతో కలిసి భోజనం చేసి సందడిగా గడిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టాభివృద్ధి ఫలాలు, కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి తెలంగాణ బిడ్డ దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటారని తెలిపారు. ఏదో ఒక రకంగా బీజేపీ బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వ లబ్ధిదారుడేనని అన్నారు. ఈ ప్రాంత ఎంపీ వల్ల అభివృద్ధి ఏమీ జరగలేదని, పైగా పసుపు బోర్డు పేరుతో రైతులను నిండా ముంచిన బీజేపీని నమ్మే ప్రసక్తేలేదని తేల్చి చేప్పారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్తోనే బాగుపడుతుందని, పదేండ్లలోనే రాష్ట్రంలో వందేళ్ల అభివృద్ధి జరిగిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నక్కలు, తోడేళ్ల వంటివని, వాటి నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. దేశంలో ఆకలి పెరగడానికి బీజేపీయే కారణమని విమర్శించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
దేశంలో రెండు పూటలా అన్నం దొరుకుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలను ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గతంలో నీళ్లు లేక వ్యవసాయం ఎడారిగా మారితే.. నేడు నీళ్లు ఎక్కువై భూములు జాలు వారుతున్నాయని చెప్పారు. ఈ సమ్మేళనంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.