హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో రోడ్డు భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించి, విజయవంతం చేయాలని డీజీపీ రవిగుప్తా (DGP Ravigupta) జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్(Video Confrence) లో ఆయన మాట్లాడారు. జనవరి 15వ తేదీ నుంచి మొదలైన మాసోత్సవాలు ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతాయని అన్నారు.
2022 సంవత్సరంలో తెలంగాణలో 7, 500 మంది రోడ్డు ప్రమాదాల్లో ( Road Accidents) చనిపోగా, భారత్లో 1,68,000 మంది చనిపోయారని వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత (Youth) మృత్యువాత పడడం బాధాకరమని అన్నారు. రోడ్డు ప్రమాదాలను ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ద్వారా నివారించవచ్చని పేర్కొన్నారు.
రహదారులు ఉండే ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్బుల (Road safety clubs) ను ఏర్పాటు చేయాలని, పోలీస్ కార్యాలయాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ బ్యూరో , కమిషనరేట్ లలో కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ఈ చలాన్ నిధుల ద్వారా స్పీడ్ గన్స్, బ్రీత్ అనలైజర్స్ వంటి వాటిని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి ‘ గుడ్ సమారిటన్’ పేరిట సన్మానం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ , రోడ్డు భద్రత, రైల్వేల విభాగపు అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ , హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఐజీ రంగనాథ్, రోడ్ సేఫ్టీ ఎస్పీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.