హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి వారంలోగా కార్యాచరణ చేపట్టాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్అండ్బీ శాఖ పరిధిలోని రోడ్లను పటిష్ఠపరిచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై శుక్రవారం ఆయన హైదరాబాద్లోని న్యాక్ ప్రధాన కార్యాలయంలో ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ చేసిన పలు సూచనలపై కూలంకషంగా చర్చించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని తరచుగా సమీక్షించాలని, వర్షాల వల్ల పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న అధికారులు తమ పరిధిలోని పనులను వేగవంతం చేసి, నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎస్ఈ ఉండేలా చూసుకోవడంతోపాటు టెరిటోరియల్ సీఈలను నియమించుకొనేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు తెలిపారు. సమావేశంలో ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ రవీందర్రావు, సీఈలు సతీశ్, మధుసూదన్, న్యాక్ డీజీ భిక్షపతి, పలు జిల్లాల ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు.
నేడు పంచాయతీరాజ్ రోడ్లపై సమీక్ష
పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధిపై ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్లోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో రోడ్ల మరమత్తులు, పరిపాలన సంస్కరణలు తదితర అంశాలపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించనున్నారు.