ఆదిలాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్ర సామగ్రి వేలాన్ని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీసీఐ భూ నిర్వాసితులు గురువారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-నాగ్పూర్ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించారు. ఆదిలాబాద్లో సిమెంటు పరిశ్రమ ఏర్పడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని గతంలో తాము తక్కువ ధరకు భూములను విక్రయించామని, కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా పరిశ్రమను మూసివేయడంతో తాము నష్టపోయినట్టు సీసీఐ భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు అరవింద్ తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీసీఐని అమ్మడానికి నిర్ణయం తీసుకున్నందున యంత్ర సామగ్రి వేలం వేస్తున్నట్టు తెలిపారు. గతంలో తాము ఇచ్చిన భూముల ధరలు ఇప్పుడు ఎకరానికి రూ. కోటి పలుకుతున్నాయని, భూముల అమ్మకంతో కేంద్ర ప్రభుత్వం డబ్బులు దండుకోవాలని చూస్తున్నదని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూములను ఇచ్చి నష్టపోయిన తమకు తిరిగి భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం వేలం ప్రక్రియను నిలిపివేసి పరిశ్రమను పునః ప్రారంభించాలని కోరారు. సీసీఐని పునఃప్రారంభించేంత వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.