నల్లగొండ : మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలలో ఒక వ్యక్తి చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని డిఐజి ఏ.వి. రంగనాధ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో మొదటిసారిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ప్రక్రియ, రోడ్డు ప్రమాదాల వీడియోలను మద్యం సేవించి పట్టుబడిన వారికి అవగాహన కల్పించే సెంటర్ను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ మోతాదులో మద్యం సేవిస్తే శిక్ష సైతం ఎక్కువగానే ఉంటుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పెద్ద నేరం చేసినట్లుగా భావించాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో మనలను మనం రక్షించుకోవడం, ప్రమాదాలకు కారణమవుతున్న విషయాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్యను క్రమంగా తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం టిటిఐ ద్వారా కృషి చేస్తున్నామని తెలిపారు. మనల్ని మనం కాపాడుకుంటూ, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులపై ప్రేమ ఉంటే మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను మరింత ముందుకు తీసుకెళ్లి మంచి కౌన్సిలింగ్ సెంటర్ గా తీర్చిదిద్దాలని పోలీస్ అధికారులకు సూచించారు.
సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న తప్పుల కారణంగా పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితిని అర్ధం చేసుకోవాలని, రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మైనర్లకు వాహనాలు ఇస్తే వారికి వాహనం ఇచ్చిన వారిపై, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
అనంతరం మద్యం సేవించి వాహనాలు ఎట్టి పరిస్థితులలో నడపమని, హెల్మెట్, బెల్ట్ ధరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో కార్యక్రమంలో డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీలు సురేష్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సిఐలు చీర్ల శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, బాలగోపాల్, ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, సంతోష్, ట్రాఫిక్, టిటిఐ సిబ్బంది పాల్గొన్నారు.