హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం మేరకు వివిధ అంశాలపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) ఈ నెల 20న తొలిసారి సమావేశం కానున్నది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో విద్యుత్తు ఉత్పత్తి సంబంధించిన ప్రొటోకాల్, రూల్ కర్వ్, డ్యామ్ సేఫ్టీపై మార్గదర్శకాలతో పాటు ఇటీవల బోర్డు సమావేశం నిర్దేశించిన అంశాలపై చర్చించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కేఆర్ఎంబీ మెంబర్ కన్వీనర్ రవికుమార్ నేతృత్వంలోని ఈ కమిటీలో కేఆర్ఎంబీ మెంబర్ (పవర్) మౌతంగ్, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, టీఎస్ జెన్కో హైడల్ పవర్ డైరెక్టర్ వెంకట్రాజం, ఏపీ జెన్కో హైడల్ పవర్ చీఫ్ ఇంజినీర్ సుజయ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.
ఆర్డీఎస్పై అధ్యయనానికి ఆహ్వానం
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేయాలని కేఆర్ఎంబీ పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీడబ్ల్యూపీఆర్ఐ)కి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిైళ్లె స్వయంగా సీడబ్ల్యూపీఆర్ఐ అధికారులకు ఫోన్ చేసి ఆహ్వానించారు.