ఇబ్రహీంపట్నం రూరల్, మే 3 : నియోజకవర్గంలో ప్రతిరోజు వందకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఎలాంటి లక్షణాలు లేకుండా ఒకరి నుంచి ఒకరికి సులువుగా సోకుతున్నది. జనసంచారం ప్రాంతాల్లో విందులు, వినోదాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం లేదు. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించింది. జాగ్రత్తలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
నిబంధనలు పాటించకపోతే జరిమానా..
నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం మాస్కు వాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ సైదులు, మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిరోజూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా దరిచేరకుండా అవగాహన కల్పిస్తున్నారు. ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. నిన్నమొన్నటి వరకు అవగాహన కల్పిస్తూ వచ్చిన అధికారులు ఇకపై నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించాలని నిర్ణయించారు. జాగ్రత్తలు పాటించకుండా సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తే కేసుల నమోదుకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. గత నెల 10 నుంచి మాస్కు లేకుండా సంచరిస్తున్న ప్రజలకు జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
కఠిన చర్యలు ..
కరోనా నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలతో ప్రతిరోజూ అవగాహన కల్పిస్తున్నాం. చౌరస్తాల్లో వాహనదారులకు కానిస్టేబుళ్లతో అవగాహన కల్పిస్తున్నాం. కరోనా కట్టడి దిశగా ప్రభుత్వ సూచనల మేరకు కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
-సైదులు, సీఐ ఇబ్రహీంపట్నం