మరో ఆర్నెల్లు పొడిగింపు.. జల్శక్తిశాఖ ఉత్తర్వులు
గతంలోనే కేంద్రానికి సూచించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 2 : కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల గెజిట్ అమలును మరో 6 నెలల పాటు కేంద్రం వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర జల్శక్తిశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని అనుసరించి తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాలు, నిర్వహణకు సెక్షన్ 84 ప్రకారం కృష్ణా, గోదావరి రివర్ బోర్డులను ఏర్పాటు చేసింది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన 60 రోజుల్లోగా అమల్లోకి రావాలి. అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతులు పొందాలి. అయితే, గెజిట్పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. అమలును వాయిదా వేయాలని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్ను కోరారు. రాష్ర్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల డీపీఆర్లను ఇప్పటికే సమర్పించినా, అనుమతుల మంజూరులో తీవ్ర జాప్యం అవుతున్నదని వెల్లడించారు. వాటిని పరిగణనలోకి తీసుకొన్న కేంద్రం తాజాగా గెజిట్ అమలు కాలపరిమితిని పొడిగించింది.