భవిష్యత్యతుల ప్రఖ్యో దివి దేవైశ్చదుర్లభః
సర్వదా శ్లాఘనీయోమే తీర్థో యం దేవ భూభుజామ్
సర్వర్తు ఫల పుష్పాడ్యే యాదాద్రౌ సుమనోహరే
భవిష్యతి పరంధామ నేత్రానన్ద ప్రవర్ధనమ్
తాత్పర్యం: భవిష్యత్తులో ఈ యాదాద్రి క్షేత్రం దేవతలకైనా అలవి కాని సాటిలేని కీర్తిని పొందుతుంది. దేవతలకు, బ్రాహ్మణులకు తీర్థరాజమై వర్ధిల్లుతుంది. షడృతువులయందలి ఫల పుష్పములచే నిండి మనోహరమైన యాదాద్రినందు నేత్రానందకరమైన పరంధామము భవిష్యత్తులో నిర్మాణం కాగలదు.
యాదాద్రి క్షేత్ర మహత్యం .. 230వ పేజీ 28, 30 శ్లోకాలు
హైదరాబాద్/యాదాద్రి మార్చి 19 (నమస్తే తెలంగాణ): నారసింహుడు పంచరూపాలలో స్వయంవ్యక్తమైన అపూర్వ క్షేత్రం యాదాద్రి భవిష్యత్తులో వైభవోపేతమై జగద్విఖ్యాతి చెందుతుందని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడట. ఇప్పుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మహాద్భుతంగా తీర్చిదిద్దిన యాదశైలం విశ్వమంతటా దేదీప్యమానంగా ప్రకాశించే సమయం ఆసన్నమైంది. గతంలో ఫలానా ఆలయం ఫలానా రాజు నిర్మించాడని చదువుకొనే వాళ్లం. ఇవాళ.. మన కండ్లముందు జరిగిన పంచనారసింహ క్షేత్ర పునర్నిర్మాణాన్ని అనుభూతి చెందుతున్నాం. సప్త గోపురాలు, విమానాలు, ప్రాకారాలు, శిల్పాలు, కుడ్యాలు, తోరణాలు, విద్యుత్తు కాంతులచేత వెలుగొందుతున్న యాదాద్రి దివ్యశైలం.. పునరావిష్కారానికి సన్నద్ధమైంది. సోమవారంనుంచి మాహాకుంభ సంప్రోక్షణ ప్రారంభం కానున్నది. పంచకుండాత్మక యాగంతో వేదఘోషతో అపూర్వంగా నరసింహస్వామి సమారంభం మొదలవుతుంది. ప్రతిరోజూ పగలు.. రాత్రి యాగ కార్యక్రమాలతో పాటు.. పారాయణాదులు కూడా కొనసాగుతాయి. చివరిరోజున మహాకుంభాభిషేకంతో పరిసమాప్తి అవుతుంది. ఈ నెల 28 సోమవారం నుంచి స్వయంవ్యక్తమైన అయిన పంచనారసింహుడు తన దివ్య దర్శనంతో భక్తులను అనుగ్రహించనున్నాడు.
మహాకుంభ సంప్రోక్షణకు కావాల్సిన ఏర్పాట్లకు పనులు చకచకా సాగుతున్నాయి. నూతనంగా నిర్మాణమైన స్వామివారి గర్భాలయ ముఖమండపం, మహా మండపంలోని ఉపాలయాలు, మూర్తుల పరిశుద్ధి కార్యక్రమాన్ని ప్రధానార్చకుల బృందం శనివారం చేపట్టింది. రెండు గంటలపాటు ప్రధానాలయం, గర్భాలయంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఆలయాన్ని ప్రత్యేకమైన జలాలతో శుద్ధిచేశారు. అనంతరం మహామండపంలోని గోదాదేవి, రామానుజులు, ఆళ్వారు, శైవ మండపం, ఉపాలయాలతోపాటు శరణాలయాలను శుద్ధిచేశారు. ఆండాళ్, రామానుజులు, ఆళ్వారు విగ్రహాలకు జలాభిషేకం, ధాన్యాభిషేకం నిర్వహించి ఉపాలయాల్లో ప్రతిష్ఠిస్తారు. బాలాలయంలో సోమవారం ప్రారంభమయ్యే పంచకుండాత్మక మహాయాగానికి సంబంధించి యాగశాల నిర్మాణమైంది. కుంభ స్థాపనలకు అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వడ్లోజు వెంకటేశ్ సహకారంతో 50 క్వింటాళ్ల మోదుగు కర్రను సమీకరించారు.
యాదాద్రీశుడి నూతనాలయంలో స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం పసిడి కాంతులతో ధగధగలాడుతున్నది. 1,786 గ్రాముల మేలిమి బంగారంతో చైన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ సంస్థ ప్రత్యేక స్వర్ణతాపడంతో తీర్చిదిద్దిన ధ్వజస్తంభం మహాద్భుతంగా దర్శనమిస్తున్నది. బంగారు తాపడంపై పుష్పాలు, సింహం, ఉప పీఠాల వంటి ఆకృతులు, వాటిలో లతలు, పుష్పాలు చూడచక్కని రూపాలతో భక్తులకు దర్శనమివ్వనున్నాయి.