Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో రుతుపవనాల కదలిక నెమ్మదించడం, వర్షాలు నిలిచిపోవడంతో రాష్ట్రంలో వేడి తీవ్రత పెరిగింది. మూడు రోజుల ముందు వరకు వర్షాలతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీంతో ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. అయితే ఆగస్టు 20 వరకు తెలంగాణలో ఉక్కపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అప్పటి వరకు దట్టమైన మేఘాలు వచ్చి వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది. సాధారణంగా అయితే ఆగస్ట్లో భారీ ఎత్తున వర్షాలు కురువాల్సి ఉంది. కానీ ఎండలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రుతుపవనాల కదలిక నెమ్మదిగా ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అయితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆగస్టు 11 వరకు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్టు 10 వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితులు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ర్టాల్లో కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 11న ఉప -హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మీదుగా ఏకాంత ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ర్టాలలో కూడా భారీ వర్షాలుకురుస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ర్టాల్లో కూడా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.