హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అప్పుడే ఉక్కపోత మొదలైంది. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో కొంత చలిగా ఉన్నప్పటికీ పగటి వేళ మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 44 శాతంగా ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.