సూర్యాపేట : పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై మహిళలు తిరుగుబావుటా ఎగుర వేశారు. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానాలపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నారీ లోకం పెద్ద ఎత్తున స్పందించింది. ప్రధాని మోదీ డౌన్ డౌన్ ..కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలి..పెరిగిన గ్యాస్,డీజిల్ ధరలు తగ్గించాలనే ఆడబిడ్డల నినాదాలతో సూర్యాపేట పట్టణం మార్మోగింది.
జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి మొదలైన మహిళల నిరసన ప్రదర్శన.. శంకర్ విలాస్,యంజి రోడ్, తెలంగాణా తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్ స్టాండ్ కు చేరుకుంది. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన చార్జీలను తగ్గించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.