మాదాపూర్, ఫిబ్రవరి 21: భారతలో క్యాన్సర్ కేసులు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయని యశోద గ్రూప్ హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో 14.6 లక్షలుగా ఉన్న కొత్త కేసుల సంఖ్య 2025 నాటికి 15.7 లక్షలకు పెరిగాయని తెలిపారు. హెమటాలజీలో కృత్రిమ మేధస్సు (ఏఐ) భాగస్వామ్యంతోపాటు బ్లడ్ క్యాన్సర్ నిర్థారణ, చికిత్సలో అందుబాటులోకి వచ్చిన ఏఐ సాంకేతిక పురోగతులపై ‘డెక్కన్ హెమటోలింక్ 3.0’ పేరిట శనివారం హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. 700 మందికిపైగా హెమటాలజీ వైద్య నిపుణులు పాల్గొన్న ఈ సదస్సును ‘యశోద’ సీనియర్ హెమటాలజిస్ట్ డాక్టర్ గణేశ్ జైషెట్వార్తో కలిసి డాక్టర్ జీఎస్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏఐ సాంకేతికత, అత్యాధునిక ఇమ్యునో థెరపీలు క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయని చెప్పారు. యశోద దవాఖానల్లో గత 13 ఏండ్లుగా 600కుపైగా ఎముక మజ్జ (బోన్ మ్యారో) మార్పిడీ చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ గణేశ్ జైషెట్వార్ తెలిపారు.
క్యాన్సర్లకు గతంలో చికిత్సలు పరిమితంగా ఉండేవని, ఇప్పుడు భారత ఫార్మా కంపెనీల ముందుచూపు వల్ల టార్గెటెడ్ థెరపీ, జన్యు చికిత్స, సీఏఆర్-టీ, సెల్ థెరపీ లాంటి అత్యాధునిక చికిత్సలు సైతం సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని వివరిస్తూ.. బ్లడ్ క్యాన్సర్కు ఇకపై భయపడాల్సిన పనిలేదని, ముందస్తు వ్యాధి నిర్ధారణ, అత్యాధునిక చికిత్సలతో రోగులు పూర్తిగా కోలుకోగలుగుతున్నారని చెప్పారు.